సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో భారత్ పోరాడుతోంది. తొలి రోజు ఆట ముగిసేసరికి ఎనిమిది వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (70*; 105 బంతుల్లో) జట్టును ఆదుకున్నాడు. సౌతాఫ్రికా బౌలర్లలో కగిసో రబాడ అయిదు వికెట్లతో సత్తా చాటాడు. బర్గర్ రెండు వికెట్లు తీశాడు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా 24 పరుగులకే టాప్ ఆర్డర్ను కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన శ్రేయస అయ్యర్ (31)తో కలిసి విరాట్ కోహ్లి (38) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. వీరిద్దరు కలిసి 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే లంచ్ విరామం తర్వాత రబాడ వీరిద్దరిని ఔట్ చేసి టీమిండియాను మరింత కష్టాల్లో నెట్టాడు.

కోహ్లిని ఔట్ చేయడానికి లంచ్ బ్రేక్లో పక్కా ప్లాన్ వేశామని రబాడ తెలిపాడు. ''స్వింగ్ అయ్యే బంతుల్ని కోహ్లి చక్కగా కవర్ చేయగలడు. కానీ కొన్ని సార్లు మిస్ అవుతాడు. ఎడ్జ్ తీసుకుని అతడు ఔటైనందుకు సంతోషంగా ఉంది. ఈ రోజు నాది అయింది. నా బౌలింగ్ ప్రదర్శనపై ఆనందంగా ఉన్నా. అనుభవం ఉన్న టీమిండియాను 208 పరుగులకే ఎనిమిది వికెట్ల తీయడం బాగుంది''
''మా జట్టులో ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ పేసర్లు ఉన్నారు. బంతిని స్వింగ్ చేస్తున్నారు. లంచ్ తర్వాత ఓ ప్లాన్ వేశాం. వికెట్లు సాధించడానికి లెగ్ స్లిప్లో ఫీల్డర్లను మొహరించాం. కోహ్లి ఇన్నింగ్స్ ఆరంభంలోనే అతడిని స్క్వేర్ లెగ్లో ఔట్ చేసే అవకాశం వచ్చింది. లంచ్ తర్వాత వ్యూహాలు మార్చుకొని బరిలోకి దిగాం'' అని రబాడ అన్నాడు. కేఎల్ రాహుల్ ఆటను రబాడ కొనియాడాడు. రాహుల్ షాట్ల ఎంపిక బాగుందని, గొప్పగా ఆడాడని అన్నాడు.