జొహానెస్బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఆఖరి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. 135 పరుగుల తేడాతో నెగ్గి నాలుగు టీ20ల సిరీస్ను 3-1తో కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 283 పరుగుల భారీ స్కోరు చేసింది. తిలక్ వర్మ (120 నాటౌట్; 47 బంతుల్లో, 9 ఫోర్లు, 10 సిక్సర్లు), సంజు శాంసన్ (109 నాటౌట్; 56 బంతుల్లో, 6 ఫోర్లు, 9 సిక్సర్లు) అజేయ శతకాలతో విధ్వంసం సృష్టించారు.
అభిషేక్ శర్మ (36; 18 బంతుల్లో, 2 ఫోర్లు, 4 సిక్సర్లు) పరుగులు చేశాడు. సిపామ్లా (1/58) ఒక్క వికెట్ తీశాడు. అనంతరం కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 18.2 ఓవర్లలో 148 పరుగులకే కుప్పకూలింది. హెన్రిచ్ క్లాసెస్ (43; 29 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (36; 27 బంతుల్లో, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్లు. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ (3/20) మూడు వికెట్లు, వరుణ్ చక్రవర్తి (2/42), అక్షర్ పటేల్ (2/6) చెరో రెండు వికెట్లు, హార్దిక్, రమన్దీప్, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీశారు.

కాగా, తిలక్-శాంసన్ ధనాధన్ బ్యాటింగ్తో, భారీ విజయంతో టీమిండియా పలు రికార్డులు సృష్టించింది. టీ20 ఫార్మాట్లో దక్షిణాఫ్రికాపై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా భారత్ నిలిచింది. సౌతాఫ్రికాతో 31 టీ20లు ఆడిన టీమిండియా 18 సార్లు నెగ్గింది. అంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా (17) పేరిట ఉండేది. పరుగుల పరంగా దక్షిణాఫ్రికాకు అతిపెద్ద ఘోర పరాజయం ఇదే (135 పరుగులు). అంతకుముందు ఆసీస్ చేతిలో ఓడిన 111 పరుగుల తేడాతో ఓటమి రికార్డుగా ఉండేది.
ఇక పరుగుల పరంగా భారత్కు మూడో భారీ విజయం. 2023లో న్యూజిలాండ్పై 168 పరుగులు, 2018లో ఐర్లాండ్పై 143 పరుగుల విజయం తొలి రెండు ఘన విజయాలు. విదేశాల్లో భారత్కు ఇదే అత్యుత్తమ స్కోరు (283/1). అలాగే దక్షిణాఫ్రికాలో ఓ జట్టుకు ఇదే అత్యధిక స్కోరు. అంతర్జాతీ టీ20ల్లో ఓవరాల్గా ఇది రెండో అత్యుత్తమ స్కోరు. ఇటీవల బంగ్లాదేశ్పై టీమిండియా సాధించిన 297/6 స్కోరు టాప్లో ఉంది.
సెంచరీలతో కదం తొక్కి 210 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదుచేసిన శాంసన్-తిలక్ వర్మ ఆల్టైమ్ రికార్డు నెలకొల్పారు. టీ20ల్లో ఏ వికెట్కు అయినా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. అలాగే సౌతాఫ్రికాపై ఏ వికెట్కు అయినా ఇదే అతిపెద్ద భాగస్వామ్యం. అంతర్జాతీయ టీ20ల్లో రెండో వికెట్ లేదా అంతకంటే దిగువ వికెట్లకు ఇదే భారీ భాగస్వామ్యం. కాగా, ఓ అంతర్జాతీయ టీ20 ఇన్నింగ్స్లో ఐసీసీ పూర్తి సభ్యదేశాల్లో ఇద్దరు బ్యాటర్లు సెంచరీలు చేయడం ఇదే మొదటిసారి.
ఇక ఈ మ్యాచ్లో టీమిండియా 23 సిక్సర్లు సాధించి ఆల్టైమ్ రికార్డు సాధించింది. టాప్-10 జట్లలో ఓ ఇన్నింగ్స్లో అత్యధిక సిక్సర్లు సాధించిన జట్లుగా నిలిచింది. అంతకుముందు ఈ రికార్డు అఫ్గానిస్థాన్, వెస్టిండీస్, టీమిండియా (22) పేరిట ఉమ్మడిగా ఉండేది. మరోవైపు తిలక్, శాంసన్ వ్యక్తిగత రికార్డులు కూడా నమోదు చేశారు. ఒకే క్యాలెండర్ ఏడాదిలో అంతర్జాతీయ టీ20ల్లో మూడు శతకాలు చేసిన తొలి ప్లేయర్గా శాంసన్ నిలిచాడు. అతను గత అయిదు మ్యాచ్ల్లో మూడు సెంచరీలు బాదాడు. అలాగే టీ20ల్లో వరుసగా రెండు శతకాల సాధించిన అయిదో ప్లేయర్గా తిలక్ వర్మ చరిత్రకెక్కాడు.