బెంగళూరు: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి టీ20 మ్యాచ్లో భారత బ్యాట్స్మెన్ పూర్తిగా తడబడ్డారు. దక్షిణాఫ్రికా బౌలర్లు చెలరేగడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసి.. ప్రొటీస్ ముందు 135 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. ఓపెనర్ శిఖర్ ధావన్ టాప్ స్కోరర్ (36). కాగిసో రబాడ మూడు వికెట్లు తీసాడు.
విరామాన్ని పొడిగించనున్న ధోనీ.. బంగ్లాదేశ్ సిరీస్కు కూడా దూరం?
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ (9) పూర్తిగా నిరాశపరిచాడు. అనంతరం ధావన్, కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆచితూచి ఆడారు. దీంతో 5 భారత్ ఒక వికెట్ కోల్పోయి 41 పరుగులు చేసింది. ఆ తర్వాతి ఓవర్లో ధావన్ రెండు సిక్సులు బాదంతో స్కోర్ ఒక్కసారిగా పెరిగింది. ఈ క్రమంలో భారీ షాట్ ఆడిన ధావన్ క్యాచ్ ఔట్ అయి పెవిలియన్ చేరాడు.
ఆ తర్వాతి ఓవర్లో కోహ్లీ (9) కూడా భారీ షాట్ ఆడి నిష్క్రమించాడు. ప్రొటీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో భారత్ 10 ఓవర్లలో మూడు వికెట్లకు 76 పరుగులు చేసింది. రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ క్రీజులో ఉన్నా.. స్కోర్ బోర్డు వేగం మాత్రం పెరగలేదు. పంత్ (19) కొద్దిసేపు క్రీజులో ఉన్నా .. అయ్యర్ (5), కృనాల్ (4) పూర్తిగా నిరాశపరిచారు. హార్దిక్ పాండ్యా (14), జడేజా (19) క్రీజులో ఉన్నా.. వేగంగా ఆడలేకపోయారు. ఇన్నింగ్స్ చివరలో వరుసగా వికెట్లు కోల్పోయిన భారత్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. చివరి 10 ఓవర్లలో భారత్ 58 పరుగులు మాత్రమే చేసి ఆరు వికెట్లు కోల్పోయింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో కాగిసో రబాడా 3 వికెట్లు పడగొట్టాడు.