
హైదరాబాద్: మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా కేప్టౌన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో కోహ్లీసేన దారుణంగా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. పేస్ బౌలింగ్కు అనుకూలించే సఫారీ పిచ్ల మీద 208 పరుగుల విజయ లక్ష్యాన్ని చేధించలేక చేతులెత్తేశారు.
దీంతో తొలి టెస్టులో దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా 72 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. తొలి టెస్టులో పాండ్యా ఒక్కడే తొలి ఇన్నింగ్స్లో 93 పరుగులు చేసి కాస్త ఫరవాలేదనిపించాడు. తొలిటెస్టులో ఘోర పరాభవం ఎదురైన నేపథ్యంలో రెండో టెస్టు కోసం బరిలోకి దిగబోయే తుది జట్టు ఎంపికపై జట్టు మేనేజ్మెంట్ తీవ్ర కసరత్తులు చేస్తోంది.
కేప్టౌన్ పిచే ఇలా ఉంటే ఇక, రెండో టెస్టు మ్యాచ్ జరగబోయే సెంచూరియన్ పిచ్ ఇంకెలాగ ఉంటుందనే విషయంలో బ్యాట్స్మెన్ను ఒకింత కలవరానికి గురవుతున్నారు. అయితే రెండో టెస్టుకు సన్నద్ధం అవుతున్న కోహ్లీసేనకు పిచ్ క్యూరేటర్ ఓ శుభవార్త చెప్పాడు.
రెండో టెస్టు కోసం సంప్రదాయ వికెట్ను రూపొందిస్తున్నట్లు పిచ్ క్యూరేటర్ బ్ర్యాన్ బ్లోయ్ పేర్కొన్నాడు. క్రిక్బజ్కు ఇచ్చిన ఇంటర్యూలో రెండో టెస్టు మ్యాచ్ జరిగే సెంచూరియన్ పిచ్ మీద పచ్చిక తక్కువగా ఉంటుందని.. ఫలితంగా ఎక్స్ట్రా పేస్, బౌన్స్ ఉండవని చెప్పాడు.
అంతేకాదు ఈ పిచ్ మీద ఐదు రోజుల ఆట సాధ్యం అవుతుందని అన్నాడు. తొలి రోజు పిచ్ మందకొడిగా ఉంటుందని.. ఆట ఆరంభంలో సీమ్కు అనుకూలిస్తుందని చెప్పాడు. రెండు, మూడు రోజుల్లో పిచ్ వేగవంతం అవుతుందని, నాలుగు, ఐదు రోజుల్లో మందగిస్తుందని చెప్పాడు.
ఇక వాతావరణం విషయానికి వస్తే వర్ష సూచన లేదని, పిచ్ నుంచి స్పిన్నర్లకు కొద్దిపాటి సహకారం లభిస్తుందన్నాడు. అయితే బంతి అనూహ్యంగా టర్న్ అయ్యే ఛాన్స్ లేదని పేర్కొన్నాడు. వన్డే, టీ20 క్రికెట్లో స్పిన్నర్లు కూడా బౌలింగ్ చేస్తారని తెలిపాడు. దీనిని బట్టి చూస్తుంటే సెంచూరియన్ పిచ్ మీద బ్యాటింగ్ కేప్ టౌన్ అంత కష్టంగా ఉండదని తెలుస్తోంది.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.