15వ సారి బద్దలు:
ఈ మ్యాచ్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (254)ను కోహ్లీ అందుకున్నాడు. ఇంతకుముందు శ్రీలంకపై 243 పరుగులు చేశాడు. అయితే కోహ్లీ తన వ్యక్తిగత స్కోరును 15వ సారి బద్దలు కొట్టాడు. కోహ్లీ తన అత్యధిక వ్యక్తిగత స్కోరును ప్రతి సంవత్సరంకు మెరుగుపరుచుకుంటున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక వ్యక్తిగత స్కోరుని 15 సార్లు బద్దలు కొట్టిన ఏకైక ఆటగాడిగా కూడా చరిత్ర సృష్టించాడు.
నాలుగో స్థానంలో కోహ్లీ:
కోహ్లీ వెస్టిండిస్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా దేశాలపై డబుల్ సెంచరీలు చేసాడు. ఒక్క ఆస్ట్రేలియాపై మాత్రమే బాకీ ఉన్నాడు. ఆసీస్ దిగ్గజం బ్రాడ్మన్ 12 డబుల్ సెంచరీలతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. లంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర (11), విండీస్ మాజీ కెప్టెన్ బ్రియానా లారా (9) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ (7) నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు.
26 సెంచరీలు:
భారత్ తరఫున అత్యధికంగా డబుల్ సెంచరీలు చేసిన బ్యాట్స్మన్గా రికార్డు సృష్టించాడు. కోహ్లీ 7 డబుల్ సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా.. సచిన్ టెందుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ ఆరు సార్లు డబుల్ సెంచరీలు చేశారు. ఇక భారత కెప్టెన్లలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన కెప్టెన్గానూ కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. టెస్టుల్లో అత్యంత తక్కువ ఇన్నింగ్స్ల్లో 26 సెంచరీల రికార్డు సాధించిన నాలుగో క్రికెటర్.
బ్రాడ్ మన్ రికార్డు బద్దలు:
టెస్టుల్లో 7 వేల పరుగులను కూడా కోహ్లీ పూర్తి చేసుకున్నాడు. భారత బ్యాట్స్మన్లలో కోహ్లీది 7వ స్థానం. ఇక అత్యంత వేగంగా 7000 పరుగుల మైలురాయిని అందుకున్న రెండో భారత క్రికెటర్గా కోహ్లీ నిలిచాడు. కోహ్లీకి కంటే ముందు ఈ జాబితాలో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నాడు. ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్ డాన్ బ్రాడ్ మన్ (6996) పరుగుల రికార్డుని కోహ్లీ అధిగమించాడు.
పాంటింగ్ సరసన కోహ్లీ:
తాజా సెంచరీ కోహ్లీకి టెస్టుల్లో 26వది. కెప్టెన్గా మాత్రం 19వ సెంచరీ. కెప్టెన్గా 19 సెంచరీలు చేసిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ సరసన కోహ్లీ నిలిచాడు. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ 25 సెంచరీలతో అందరికంటే ముందున్నాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్గా తొమ్మిది సార్లు 150కి పైగా స్కోర్ చేసి ఆస్ట్రేలియన్ క్రికెటర్ బ్రాడ్మన్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. బ్రాడ్మన్ ఎనిమిది సార్లు 150కి పైగా స్కోర్ చేశాడు.