పుణె: మూడు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో భాగంగా పుణెలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో భారత్ భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (254*; 336 బంతుల్లో 33×4, 2×6) డబుల్ సెంచరీ, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (91; 104 బంతుల్లో 8×4, 2×6) మెరుపు అర్ధ సెంచరీ చేయడంతో.. భారత్ 601/5 వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ముత్తుసామి వేసిన 156.3వ బంతికి డిబ్రూన్కు జడేజా క్యాచ్ ఇచ్చాడు. ఆ వెంటనే కోహ్లీ తన త్రిబుల్ సెంచరీ గురించి ఆలోచించకుండా ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశాడు. కోహ్లీ సారథ్యంలో భారత్ 600 స్కోరు చేయడం ఇది పదోసారి.
మళ్లీ కోచ్గా అనిల్ కుంబ్లే.. రెండేళ్ల ఒప్పందం!!
ఈ రోజు కోహ్లీ, రహానేలు తొలి ఇన్నింగ్స్ను ఓవర్ నైట్ స్కోర్ వద్ద మొదలెట్టారు. కోహ్లీ, రహానే (59)లు ప్రొటీస్ బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ నాలుగో వికెట్కు 178 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. ఈ క్రమంలో రహానే హాఫ్ సెంచరీ తర్వాత మహారాజ్ బౌలింగ్లో వికెట్ కీపర్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అనంతరం విరాట్ కోహ్లీ, జడేజా పరుగుల వరద పారించారు. సెంచరీ అనంతరం మరింత రెచ్చిపోయిన కోహ్లీ.. సునాయాసంగా డబుల్ సెంచరీ చేసాడు. మరోవైపు జడేజా వన్డే మాదిరి ఆడుతూ.. అర్ధ సెంచరీ చేసాడు.
ఈ క్రమంలోనే కోహ్లీ తన అత్యధిక స్కోరు 243ను దాటేశాడు. సెనురాన్ ముత్తుసామి వేసిన 154.4వ బంతిని బౌండరీకి తరలించి టెస్టుల్లో అత్యధిక పరుగుల మైలురాయిని అధిగమించాడు. భారత్కు కెప్టెన్గా ఉన్న అందరిలోనూ ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ధాటిగా ఆడే క్రమంలో జడేజా త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. జడేజా ఔట్ అయిన వెంటనే కోహ్లీ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేశాడు.
అనంతరం రెండవ రోజు దక్షిణాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించింది. అయితే సఫారీ జట్టుకు భారత పేసర్ ఉమేష్ యాదవ్ ఆదిలోనే షాక్ ఇచ్చాడు. ఉమేష్ తన రెండో బంతికే ఓపెనర్ మార్క్రమ్ను డకౌట్ చేసాడు. ఉమేష్ తన తర్వాతి ఓవర్లో మరో ఓపెనర్ ఎల్గర్ (6)ను సైతం పెవిలియన్ చేర్చాడు. దీంతో దక్షిణాఫ్రికా 13 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.