
ఆదిలోనే భారీ షాక్:
రెండో రోజు మూడో సెషన్లో తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికాకు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. సఫారీ జట్టును పేసర్ ఉమేష్ యాదవ్ దెబ్బ తీశాడు. జట్టు స్కోరు రెండు పరుగుల వద్ద ఓపెనర్ అయిడెన్ మార్కరమ్ను డకౌట్ చేసాడు. ఇక 13 పరుగుల వద్ద మరో ఓపెనర్ డీన్ ఎల్గర్ (6)ను పెవిలిన్ పంపి ప్రొటీస్ జట్టును కష్టాల్లోకి నెట్టాడు. మార్క్రమ్ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్న ఉమేశ్.. ఎల్గర్ను బౌల్డ్ చేశాడు.

15 ఓవర్లకు 36/3:
అనంతరం జట్టు స్కోరు 33 పరుగుల వద్ద స్టార్ పేసర్ మహ్మద్ షమీ దక్షిణాఫ్రికాను మరో దెబ్బ కొట్టాడు. టెస్ట్ స్పెసలిస్ట్ బవుమా (8) షమీ బౌలింగ్లో కీపర్ వృద్ధిమాన్ సాహాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో ప్రొటీస్ జట్టు పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రొటీస్ జట్టు 15 ఓవర్లకు 36/3 గా ఉన్న సమయంలో రెండో రోజు ఆట ముగిసింది. ప్రస్తుతం డి బ్రూయిన్ (20), నూర్జె (2) క్రీజులో ఉన్నారు. దక్షిణాష్రికా ఇంకా 565 పరుగులు వెనుకబడి ఉంది.

చెలరేగిన కోహ్లీ:
273/3 పరుగుల ఓవర్నైట్ స్కోర్తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా ఆకాశమే హద్దుగా చెలరేగింది. తొలి రోజు 73 బంతుల్లో 27 పరుగులే చేసిన కెప్టెన్ విరాట్ కోహ్లీ రెండో రోజు చెలరేగాడు. కోహ్లీ, రహానే (59)లు ప్రొటీస్ బౌలర్లను సమర్ధంగా ఎదుర్కొంటూ నాలుగో వికెట్కు 178 పరుగుల భాగస్వామ్యం జోడించాడు. ఈ క్రమంలో రహానే హాఫ్ సెంచరీ తర్వాత మహారాజ్ బౌలింగ్లో వికెట్ కీపర్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.

జడేజా పరుగుల వరద:
అనంతరం విరాట్ కోహ్లీ, జడేజా పరుగుల వరద పారించారు. సెంచరీ అనంతరం మరింత రెచ్చిపోయిన కోహ్లీ.. సునాయాసంగా డబుల్ సెంచరీ చేసాడు. మరోవైపు జడేజా వన్డే మాదిరి ఆడుతూ.. అర్ధ సెంచరీ చేసాడు. ఈ క్రమంలోనే 104 బంతుల్లోనే 91 పరుగులు సాధించాడు. అయితే సెంచరీకి చేరువైన జడేజా ఐదో వికెట్గా డీ బ్రూయిన్ బౌలింగ్లో క్యాచ్ ఔట్ అయ్యాడు. అతను ఔటైన అనంతరం ఇన్నింగ్స్ డిక్లేర్ చేస్తున్నట్టు కోహ్లీ ప్రకటించాడు. ఇక 254 పరుగులతో నాటౌట్గా నిలిచిన కోహ్లీకి ఇది 26వ టెస్టు సెంచరీ కాగా.. సారథిగా 19వది కావడం విశేషం.


Click it and Unblock the Notifications
