పుణె: పుణె వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 77 ఓవర్లలలో ఎనిమిది వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా టెయిలెండర్లు ఫిలాండర్, కేశవ్ మహారాజలు భారత బౌలర్లను విసిగిస్తున్నారు. ఇద్దరూ ఇరవై ఓవర్లకు పైగా క్రీజులో నిలబడి వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. ఈ జోడి ఆచితూచి ఆడుతూ.. వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ 50 పరుగుల భాగస్వామ్యంను నెలకొల్పింది. ఈ జోడీని విడదీయడానికి కెప్టెన్ విరాట్ కోహ్లీ బౌలర్లను ఎందరిని మార్చినా ఫలితం లేకుండా పోయింది. ఫిలాండర్, కేశవ్ మహారాజ జట్టు స్కోరును ఇప్పటికే 200 దాటించారు.
భారత పిచ్లు బ్యాట్స్మెన్కు అనుకూలం.. రసవత్తర పోటీలకు అనువుగా లేవు!!
ఓవర్నైట్ స్కోర్ 36/3తో మూడో రోజు బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా బ్యాట్స్మన్ భారత పేసర్ల ధాటికి క్రీజులో నిలవలేకపోయారు. మొదటగా షమీ వేసిన 18వ ఓవర్లో నోర్జె (3) స్లిప్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ చేతికి చిక్కి పెవిలియన్ చేరాడు. ఇక ఉమేశ్ యాదవ్ వేసిన 21వ ఓవర్లో డిబ్రుయిన్ (30) కీపర్ సాహాకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో మూడో రోజు ఉదయమే సఫారీ జట్టు రెండు కీలక వికెట్లు కోల్పోయింది.
53 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును డుప్లెసిస్, డికాక్లు ఆదుకునే ప్రయత్నం చేశారు. ఇద్దరు ఆచితూచి ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపారు. వీరిద్దరూ కలిసి ఆరో వికెట్కు 75 పరుగుల భాగస్వామ్యం జోడించారు. క్రీజులో కుదురుకున్న డికాక్ (31; 48 బంతుల్లో 7x4)ను అశ్విన్ బౌల్డ్ చేసి భారత్కు ఊరటనిచ్చాడు. భోజన విరామ సమయానికి దక్షిణాఫ్రికా జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది.
లంచ్ విరామం అనంతరం సేనురాన్ ముత్తుసామి (7)ని జడేజా వెనక్కి పంపాడు. అర్ధ సెంచరీ చేసిన డుప్లెసిస్ (64) కూడా పెవిలియన్ చేరడంతో సఫారీల పని అయిపోయిందనుకున్నారు. కానీ.. ఫిలాండర్, కేశవ్ మహారాజ జట్టును ఆదుకున్నారు. టీ విరామం అనంతరం మరింత రెచ్చిపోయిన ఈ జోడి వేగంగా పరుగులు చేస్తున్నారు. ప్రస్తుతం 82 ఓవర్లకు దక్షిణాఫ్రికా ఎనమిది వికెట్లు కోల్పోయి 216 పరుగులు చేసింది. క్రీజులో ఫిలాండర్ (31), మహారాజ్ (32) పరుగులతో ఉన్నారు. దక్షిణాఫ్రికా ఇంకా 385 పరుగులు వెనకబడి ఉంది.