పుణె: కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆల్రౌండర్ రవీంద్ర జడేజాలపై వైస్ కెప్టెన్ అజింక్య రహానే ప్రశంసలు కురిపించాడు. పుణె వికెట్పై 450 పరుగులే సాధ్యం. కానీ మా బ్యాట్స్మెన్ కోహ్లీ (254నాటౌట్), జడేజా (91)లు అద్భుత బ్యాటింగ్ చేసి 600 పరుగులు చేశారు అని రహానే అన్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా 601/5 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసిన సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం రహానే మీడియాతో మాట్లాడాడు.
బరువు తగ్గేందుకు జిమ్లో సానియా కసరత్తులు.. వీడియోలు చూస్తే!!
'మేము అనుకున్న పరుగులకన్నా ఎక్కువే చేసాం. మా బ్యాట్స్మెన్ ఆడిన అద్భుత ఆటతీరు వల్లే భారీ స్కోర్ సాధించగలిగాం. ఈ వికెట్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంది. తొలి రోజు మయాంక్ అగర్వాల్ (108) మంచి క్రికెట్ ఆడాడు. శుక్రవారం ఉదయం ఒక గంట పాటు బాగా ఆడటం ఎంతో ముఖ్యమైంది. 500 స్కోర్ మాత్రమే మేం అనుకున్నాం. కానీ.. 600 పరుగులు చేసాం. చాలా అందంగా ఉంది' అని రహానే తెలిపాడు.
'కోహ్లీ, జడేజాల బ్యాటింగ్ చూడటానికి తేలికగా అనిపించినా.. అది 600 స్కోర్ సాధించే వికెట్ కాదు. ఈ వికెట్పై 450-500 పరుగులే సాధ్యం. కానీ మా బ్యాట్స్మెన్ బాగా ఆడారు. కోహ్లీతో కలిసి బ్యాటింగ్ చేసేటప్పుడు మేమిద్దరం బాగా మాట్లాడుకుంటాం. ఇద్దరం కలిసి ఆడటానికి ఇష్టపడతాం. కోహ్లీ క్రీజులో ఉంటే ఒత్తిడి అస్సలు ఉండదు. కోహ్లీ బౌలర్లపై ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నిస్తుంటాడు. అతనో టాప్ బ్యాట్స్మెన్' అని రహానే కొనియాడాడు.
'మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ హనుమ విహారికి ఈ మ్యాచ్లో విశ్రాంతిని ఇవ్వడంతో జడేజా ఆరో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. కోహ్లీతో కలిసి 225 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. జడేజా భారీ షాట్లు ఆడడంతో మేం భారీ స్కోర్ చేసాం. కోహ్లీతో కలిసి 178 పరుగుల నా భాగస్వామ్యం కూడా ఎంతో ముఖ్యం' అని రహానే చెప్పుకొచ్చాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో దక్షిణాఫ్రికా ఆలౌట్ అయింది. 105.4 ఓవర్లలో 275 పరుగులు చేసింది.