టీ20ల్లో అత్యధిక పరుగులు:
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోహ్లీ (52 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్లతో 72 నాటౌట్) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కోహ్లీ అర్ధ సెంచరీ చేసే క్రమంలో ఓ రెండు రికార్డులను తన పేరుపై లికించుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. ప్రస్తుతం కోహ్లీ 2,441 పరుగులతో అగ్ర స్థానంలో ఉన్నాడు.
రెండో స్థానానికి రోహిత్:
అగ్ర స్థానం చేరే క్రమంలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మను కోహ్లీ దాటేశాడు. రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20ల్లో 2,434 పరుగులతో రెండో స్థానానికి పడిపోయాడు. రెండో టీ20లో రోహిత్ 12 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో మార్టిన్ గప్టిల్ ( 2,283-న్యూజిలాండ్) మూడో స్థానంలో ఉండగా.. షోయబ్ మాలిక్ (2,263-పాకిస్తాన్), బ్రెండన్ మెకల్లమ్ (2,140-న్యూజిలాండ్) వరుసగా నాలుగు, ఐదో స్థానంలో కొనసాగుతున్నారు.
అర్ధ సెంచరీల్లో కూడా:
అంతర్జాతీయ టీ20 అర్ధ సెంచరీల్లో కూడా రోహిత్ను కోహ్లీ అధిగమించాడు. రోహిత్ శర్మ 21 అర్థ సెంచరీలు సాధిస్తే.. కోహ్లీ 22 అర్ధ సెంచరీలతో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో మార్టిన్ గప్టిల్ (16), బ్రెండన్ మెకల్లమ్ (15), క్రిస్ గేల్ (15)లు వరుసగా ఉన్నారు. ఇక అంతర్జాతీయ టీ20 ఛేజింగ్లో కోహ్లీ 30 ఇన్నింగ్స్ల్లో 81.23 సగటుతో 1381 పరుగులు నమోదు చేశాడు. ఇందులో 15 హాఫ్ సెంచరీలు ఉండటం విశేషం.