
ఎంత ఫిట్గా ఉండాలో తెలిసింది
అర్ధ సెంచరీతో మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లీ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డుకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా కోహ్లీ మాట్లాడుతూ... 'సంజయ్ మంజ్రేకర్ నా టీ20 కెరీర్లో అత్యుత్తమ ఆటను గుర్తు చేశారు. దాని నుండి నాకు ప్రేరణ వచ్చింది. అలాంటి మ్యాచ్ ఆడి జట్టును గెలిపిస్తే ఎప్పటికి మంచి అనుభూతే. ఆ రాత్రి (2016 IND vs AUS) క్రికెట్ మైదానంలో ఎంత ఫిట్గా ఉండాలో తెలిపింది' అని కోహ్లీ అన్నాడు.

దేశం కోసం ఆడటం గర్వకారణం
'నా జెర్సీపై ఉండే పేరు (భారత్) వల్లే ఇలా ఆడుతున్నా. దేశం కోసం ఆడటం ఎప్పుడూ గర్వకారణం. బరిలో దిగాక నేను చేయాల్సింది అంతా చేస్తా. ఎలాగైనా జట్టుని గెలిపించాలని అనుకుంటా. ఈ క్రమంలోనే పరుగులు సాధిస్తా. జట్టుని గెలిపించాలని అనుకుంటే నీకు దారి దొరుకుతుంది. నేను ఎప్పుడూ నా గురించి ఆలోచించను, జట్టుకు అవసరమైన దాని గురించి మాత్రమే ఆలోచిస్తా' అని కోహ్లీ పేర్కొన్నాడు.

బౌలర్లు ఎంతో కష్టపడ్డారు
'ఈ మ్యాచ్లో మా బౌలర్లు ఎంతో కష్టపడ్డారు. పిచ్ బాగుండడంతో దక్షిణాఫ్రికా మంచి ఆరంభాన్ని సాధించింది. ఆపై బౌలర్లు అద్భుతంగా బంతులేసి మ్యాచ్పై పట్టు సాధించారు. కొత్త వారిని ప్రయత్నించడంతో పాటు ఒత్తిడిలో ఎవరు బాగా రాణిస్తారో వారి కోసమే మేం వెతుకుతున్నాం. మాకు చాలా సానుకూల సంకేతాలు వచ్చాయి. యువకులు వారి సామర్థ్యాన్ని నిరూపించడానికి మరిన్ని మ్యాచులను పొందుతారు' అని కోహ్లీ తెలిపాడు.

ఒత్తిడిలో అద్భుతంగా పోరాడారు
'దక్షిణాఫ్రికా జట్టులోకి వచ్చిన కొత్త ఆటగాళ్లు జార్న్ ఫార్చున్, ఆన్రిచ్ నార్జ్, తెంబా బవుమా బాగా ఆడారు. ఒత్తిడిలో కూడా వారు అద్భుతంగా పోరాడారు. దక్షిణాఫ్రికా జట్టు త్వరలో మంచి స్థితికి చేరుకుంటుంది' అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. రెండో టీ20లో ఫార్చున్, నార్జ్, బవుమా అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications
