భారత్లో తొలి విజయం:
దక్షిణాఫ్రికా, టీమిండియా జట్ల మధ్య భారత్లో జరిగిన టీ20ల్లో టీమిండియాకి ఇదే తొలి విజయం. అంటే స్వదేశంలో దక్షిణాఫ్రికాపై ఇదే తొలి టీ20 విజయం. ఈ గెలుపుతో టీమిండియా చారిత్రక విజయంను అందుకుంది. అంతకుముందు 2015 భారత పర్యటన సందర్భంగా ఇరు జట్లు మూడు టీ20ల సిరీస్ ఆడగా.. రెండు మ్యాచ్లలో దక్షిణాఫ్రికానే గెలిచింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.
కోహ్లీ మాయ:
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా భారత బౌలర్లు కట్టుదిట్టమైన బంతులకు 149 పరుగులకే పరిమితం అయింది. నూతన కెప్టెన్ క్వింటన్ డికాక్ (52;37 బంతుల్లో 8x4), తెంబ బవుమ (49; 43 బంతుల్లో 3x4, 1x6) రాణించడంతో ఆ జట్టు మోస్తరు స్కోర్ సాధించింది. అనంతరం లక్ష్య చేదనలో భారత్ కేవలం మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు.
నిరాశగా డికాక్:
ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్లోనే కాదు.. అద్భుత ఫీల్డింగ్ కూడా చేసి ఔరా అనిపించాడు. ఇన్నింగ్స్ 12వ ఓవర్లో పేసర్ నవదీప్ సైనీ వేసిన ఆఫ్ కట్టర్ను డికాక్ భారీ షాట్ ఆడాడు. బంతి కాస్తా గాల్లోకి లేవడంతో మిడాఫ్లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ చిరుతలా పరిగెత్తుకుంటూ వచ్చి డైవ్ చేసి ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్నాడు. దీంతో టీమిండియా ఆటగాళ్లతో సహా అభిమానులు ఆనందంతో కేరింతలు కొట్టారు. మరోవైపు షాక్ తిన్న డికాక్ నిరాశగా పెవిలియన్ చేరాడు.