
హైదరాబాద్: డర్బన్ వేదికగా భారత్తో జరుగుతున్న తొలి వన్డేలో దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ అరుదైన ఘనత సాధించాడు. భారత్పై స్వదేశంలో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన తొలి దక్షిణాఫ్రికా కెప్టెన్గా డుప్లెసిస్ రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న డుప్లెసిస్ 120 పరుగుల వ్యక్తిగత స్కోరును నమోదు చేశాడు.
తద్వారా స్వదేశంలో టీమిండియాపై అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన దక్షిణాఫ్రికా కెప్టెన్గా అరుదైన ఘనత సాధించాడు. మొత్తంగా భారత్పై అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన రెండో దక్షిణాఫ్రికా కెప్టెన్గా నిలిచాడు. 2005లో కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్లో గ్రేమ్ స్మిత్ అజేయంగా 134 పరుగులు సాధించాడు.
అదే ఇప్పటివరకు భారత్పై దక్షిణాఫ్రికా జట్టు కెప్టెన్ నమోదు చేసిన అత్యధిక స్కోరు. భారత్పై అత్యధిక స్కోర్లు సాధించిన దక్షిణాఫ్రికా కెప్టెన్లలో ఏబీ డివిలియర్స్ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాడు. 2015లో చెన్నైలో జరిగిన వన్డేల్లో డివిలియర్స్(112) సెంచరీ సాధించగా, ఆ తర్వాత వాంఖడే స్టేడియంలో డివిలియర్స్(119) మరో సెంచరీ సాధించాడు.
కాగా, ప్రస్తుతం డర్బన్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. దీంతో భారత్కు 270 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా ఓపెనర్ హషీం ఆమ్లా (16)ని ఆదిలోనే పెవిలియన్కి పంపి భారత్ శిబిరంలో ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఉత్సాహం నింపాడు.
ఆ తర్వాత దూకుడుగా ఆడుతున్న డికాక్ (34)ని స్పిన్నర్ చాహల్ పెవిలియన్కు పంపాడు.ఈ ఇద్దరూ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగగా ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ జట్టుని నడిపించి తన కెరీర్లో 9వ సెంచరీ సాధించి జట్టుని ఆదుకున్నాడు. కెరీర్లో డుప్లెసిస్కి ఇది తొమ్మిదో శతకంకాగా.. భారత్పై రెండోది.
మరో ఎండ్లో భారత బౌలర్లు వికెట్లు తీయడంతో సఫారీ జట్టు ఒకానొక దశలో 134/5తో ఒత్తిడిలో పడింది. ఈ క్రమంలో డుప్లెసిస్తో కలిసి క్రిస్ మోరీస్ (37) భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగి స్కోరు బోర్డుని పరుగులెత్తించాడు. జట్టు స్కోరు 208 పరుగుల వద్ద అతడ్ని కుల్దీప్ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేయగా.. చివర్లో ఆండిల్ (27 నాటౌట్) ఫరవాలేదనిపించాడు.
కాగా, చివరి ఓవర్లో సిక్స్ కొట్టేందుకు ప్రయత్నిస్తూ డుప్లెసిస్ ఔటయ్యాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు, చాహల్ రెండు వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా చెరో వికెట్ తీశారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.