
హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఔట్ చేసేందుకు ప్రత్యేకంగా వ్యూహాలేవీ తమ జట్టు చేయడం లేదని దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ ఫిలాండర్ అన్నాడు. మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య కేప్ టౌన్ వేదికగా తొలి టెస్టు శుక్రవారం (జనవరి 5)న ప్రారంభం కానుంది.
గతేడాది శ్రీలంకతో జరిగిన టెస్టు సిరిస్లో విరాట్ కోహ్లీ రెండు సెంచరీలతో అద్భుతమైన ఫామ్లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోహ్ల కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారా? అని మీడియా సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానమిచ్చాడు.
'మేము ఇక్కడ బంతి, బ్యాట్తోనే క్రికెట్ ఆడతాం.. పేర్లతో కాదు. మ్యాచ్లో విరాట్ కోహ్లీ వికెట్ తీస్తాం.. అలాగే మిగిలిన 9 లేదా 10 మంది భారత బ్యాట్స్మెన్ని కూడా ఔట్ చేస్తాం. ఎవరినీ ప్రత్యేకంగా ఇక్కడ పరిగణించం. రెండు ఇన్నింగ్స్ల్లోనూ భారత్ని ఆలౌట్ చేసేందుకు ప్రయత్నిస్తాం' అని అన్నాడు.
'భారత్ ఎక్కువ శాతం మ్యాచ్ లన్నీ స్వదేశంలోనే ఆడింది. కాబట్టి దక్షిణాఫ్రికా పిచ్లు వారికి సవాలే. ఇదొక పూర్తిగా విభిన్నమైన బాల్ గేమ్. ఏ ఒక్కరినీ లక్ష్యంగా చేసుకుని బౌలింగ్ చేయం. ఏం జరుగుతుందో తొలి టెస్టు మ్యాచ్లో తెలుస్తుంది కదా' అని అన్నాడు.
ప్రతి ఒక్కరూ పచ్చిక మైదానం గురించి ప్రస్తావిస్తున్నారు కదా? అని ప్రశ్నించగా 'అయితే ఇది ఖచ్చితంగా పచ్చిక మైదానం అని చెప్పలేను. నా జీవితంలో ఎక్కువ భాగం ఇక్కడే క్రికెట్ ఆడాను. ఇలాంటి వికెట్ను గతంలో కూడా చూశాను. కొద్దిగా పచ్చిక ఉన్నప్పటికీ ఇది బ్యాట్స్ మెన్లను భయపెట్టబోదని భావిస్తున్నా' అని తెలిపాడు.
'2015లో భారత్లో మేం పర్యటించినప్పుడు మెరుగైన ప్రదర్శన చేయలేకపోయాం. కానీ.. ఇది మాకు సొంతగడ్డ కచ్చితంగా సత్తాచాటుతాం. గతేడాది టీమిండియా ఎక్కువగా సొంతగడ్డపైనే ఆడింది. అక్కడి పిచ్లతో పోలిస్తే.. ఇక్కడ పరిస్థితులు పూర్తిగా భిన్నం. చూద్దాం.. ఆ జట్టు ఎలాంటి ప్రదర్శన చేస్తుందో?' అని ఫిలాండర్ అన్నాడు.