
హైదరాబాద్: విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో ఆతిథ్య టీమిండియా పట్టు సాధించింది. రెండో రోజైన గురువారం ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 20 ఓవర్లకు గాను 3 వికెట్లు కోల్పోయి 39 పరుగులు చేసింది. డీఎన్ ఎల్గర్ (27), తెంబా బవుమా (2) నైట్ వాచ్మన్ క్రీజులో ఉన్నారు.
దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్లలో ఓపెనర్ ఐడెన్ మార్క్రమ్ (5), డి బ్రూన్ (4) తక్కువ స్కోర్లకే పెవిలియన్కు చేరగా... డేన్ పీడ్ (0) డకౌట్ అయ్యాడు. భారత బౌలర్లలో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 2 వికెట్లు తీయగా... జడేజాకు ఒక వికెట్ లభించింది.
అంతకముందు టీమిండియా తన తొలి ఇన్నింగ్స్ను 136 ఓవర్లకు గాను 502/7 వద్ద డిక్లేర్డ్ చేసింది. టీమిండియా డిక్లేర్ చేసే సమయానికి రవీంద్ర జడేజా (30), రవిచంద్రన్ అశ్విన్ (1) అజేయంగా నిలిచారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్ మూడు వికెట్లు తీయగా, ఫిలాండర్, డేన్ పీడ్త్, ముత్తుస్వామి, డీన్ ఎల్గర్లు తలో వికెట్ తీశారు.
టీమిండియా తొలి ఇన్నింగ్స్లో మయాంక్ అగర్వాల్(215; 371 బంతుల్లో 23 ఫోర్లు, 6 సిక్సర్లు) తొలి డబుల్ సెంచరీ సాధంచగా... ఓపెనర్ రోహిత్ శర్మ( 176; 244 బంతుల్లో 23 ఫోర్లు, 6 సిక్సర్లు) సెంచరీ చేయడంతో టీమిండియా ఐదు వందల పరుగుల మైలురాయిని అందుకుంది. మయాంక్ అగర్వాల్కు ఇదే టెస్టుల్లో తొలి డబుల్ సెంచరీ.
202/0 ఓవర్నైట్ స్కోరుతో గురువారం రెండో రోజు ఆట కొనసాగించిన టీమిండియా జట్టు స్కోరు 317 పరుగుల వద్ద రోహిత్ వికెట్ను కోల్పోయింది. రెండో రోజు ఆటలో మరో 115 పరుగులు జోడించిన తర్వాత రోహిత్ శర్మ(244 బంతుల్లో 176, 23 ఫోర్లు, 6 సిక్సులు) సఫారీ బౌలర్ మహరాజ్ బౌలింగ్లో వికెట్ కీపర్ క్వింటన్ డీకాక్ స్టంపౌట్ చేశాడు.
దీంతో రోహిత్ శర్మ నిరాశగా పెవిలియన్కు చేరాడు. టెస్టుల్లో రోహిత్ శర్మకు ఇది నాలుగో సెంచరీ. ఫలితంగా ధావన్, రాహుల్, పృథ్వీ షా తర్వాత ఓపెనర్గా బరిలోకి దిగిన తొలి ఇన్నింగ్స్లోనే సెంచరీ చేసిన నాలుగో భారత బ్యాట్స్మన్ రోహిత్ నిలిచాడు. ఆ తర్వాత మయాంక్ అగర్వాల్ నిలకడగా ఆడి డబుల్ సెంచరీ సాధించాడు.
సఫారీ బౌలర్ కేశవ్ మహారాజ్ బౌలింగ్లో రెండు పరుగులు తీసి మయాంక్ అగర్వాల్(358 బంతుల్లో 200, 22 ఫోర్లు, 5 సిక్సులు) టెస్టుల్లో తొలి డబుల్ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో మయాంక్ అగర్వాల్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు క్రికెట్లో తన తొలి సెంచరీని డబుల్ సెంచరీగా మార్చిన నాలుగో భారత క్రికెటర్గా గుర్తింపు పొందాడు.
అంతకముందు దిలిప్ సర్దేశాయి, వినోద్ కాంబ్లీ, కరుణ్ నాయర్లు మాత్రమే ఈ ఘనత సాధించారు. మరోవైపు పుజారా (6), విరాట్ కోహ్లీ (20), రహానే(15), హనుమ విహారి (10), వృద్ధిమాన్ సాహా (21) స్వల్ప స్కోర్లకే పెవిలియన్కు చేరారు. భారత స్కోరు ఐదొందలు దాటిన తర్వాత డిక్లేర్ చేద్దామని ముందుగానే నిర్ణయం తీసుకోవడంతో విహారి, జడేజా, సాహాలు దూకుడుగా ఆడే క్రమంలో ఔటయ్యారు.