స్వదేశంలో టెస్టు సిరీస్ను 0-3తో కోల్పోయిన టీమిండియా మరో సిరీస్కు సిద్ధమైంది. దక్షిణాఫ్రికాలో దక్షిణాఫ్రికాతో నాలుగు టీ20ల సిరీస్ ఆడనుంది. నవంబర్ 8 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. న్యూజిలాండ్ చేతిలో ఘోరపరాభవాన్ని చవిచూసిన రోహిత్ సేన తుదిజట్టులోని ఏ ఆటగాడు దక్షిణాఫ్రికా పర్యటనలో ఆడట్లేదు. సూర్యకుమార్ సారథ్యంలో యువ బృందం సఫారీలతో తలపడనుంది.
ఇక దక్షిణాఫ్రికాపై ఓవరాల్గా భారత్కు మెరుగైన రికార్డు ఉంది. ఇరు జట్లు ఇప్పటివరకు 27 మ్యాచ్లు ఆడగా టీమిండియా 15 మ్యాచ్ల్లో, సఫారీలు 11 పోరుల్లో గెలిచాయి. చివరిసారి టీ20 వరల్డ్ కప్లో భారత్- దక్షిణాఫ్రికా తలపడ్డాయి. ఆ తర్వాత ఇరు జట్లు పోటీపడటం ఇదే ప్రథమం. కాగా, ఈ సిరీస్ను ఆదాయం కోసం ఇటీవల షెడ్యూల్ చేశారు. దక్షిణాఫ్రికా బోర్డును ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించడానికి ఏర్పాటు చేస్తున్నారు.

పిచ్ ఎలా ఉంటుందంటే?
తొలి టీ20 డర్బన్ వేదికగా జరగనుంది. దక్షిణాఫ్రికాలో ఉండే మందకొడి పిచ్లలో ఇది ఒకటి. అయితే గత కొంత కాలంగా ఇది స్లో వికెట్గా కొనసాగట్లేదు. భారీ స్కోర్లకు డెన్గా మారింది. గత ఏడు మ్యాచ్ల్లో ఇక్కడ తొలి ఇన్నింగ్స్లో ఇక్కడ సగటు స్కోరు 184. అయితే ఈ మైదానంలో సౌతాఫ్రికాకు చేదు జ్ఞాపకాలు ఉన్నాయి. గతేడాది ఇదే వేదికగా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ జరగ్గా దక్షిణాఫ్రికా వైట్వాష్కు గురైంది.
మ్యాచ్కు వర్షం ఆటంకం
తొలి టీ20కి వరుణుడు ఆటంకం కలిగించేలా ఉన్నాడు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం 40 శాతం వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. 2023 డిసెంబర్లో డర్బన్ వేదికగానే భారత్ ఆడాల్సిన టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. వరుణుడు ధాటికి కనీసం టాస్ కూడా పడలేదు.
తుది జట్టు వివరాలు (అంచనా)
భారత్: సంజు శాంసన్, అభిషేక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య, రింకూ సింగ్, రమన్దీప్ సింగ్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్, అవేశ్ ఖాన్.
సౌతాఫ్రికా: రీజా హెండ్రిక్స్, రికెల్టన్, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జేన్సన్/గెరాల్డ్ కొయెట్జీ, ఆండిలే సిమెలన్, పీటర్, కేశవ్ మహరాజ్, బార్టమన్.