హైదరాబాద్: సఫారీ గడ్డపై భారత క్రికెటర్లు దూసుకుపోతున్నారు. అటు మిథాలీ సేన, ఇటు కోహ్లీ సేన తమదైన శైలిలో ప్రత్యర్థులను చిత్తు చేస్తూ ఘన విజయాలను సొంతం చేసుకుంటున్నారు. సోమవారం భారత్, దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన వన్డే మ్యాచ్లోనూ ఇదే జరిగింది.
ఈ వన్డేతో భారత మహిళా క్రికెటర్ జులన్ గోస్వామి మరో అరుదైన ఘనతను అందుకుంది. దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ కోసం ప్రస్తుతం మిథాలీ రాజ్ నాయకత్వంలోని భారత మహిళల జట్టు సఫారీ గడ్డపై పర్యటిస్తోంది.
ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య సోమవారం జరిగిన తొలి వన్డేలో లక్ష్యఛేదనలో జులన్ గోస్వామి (4/24), శిఖా పాండే (3/23), పూనమ్ యాదవ్ (2/22) ధాటికి దక్షిణాఫ్రికా 43.2ఓవర్లలో 125 పరుగులకే కుప్ప కూలింది. దీంతో 88 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత క్రికెటర్ గోస్వామి 8 పరుగులతో నాటౌట్గా నిలిచి వెయ్యి పరుగుల మైలు రాయిని అందుకుంది.
దీంతో అంతర్జాతీయ మహిళల వన్డే క్రికెట్లో వెయ్యికి పైగా పరుగులతో పాటు 150కి పైగా వికెట్లు తీసిన ఏకైక్ క్రికెటర్గా జులన్ గోస్వామి రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు 165 వన్డేలాడిన జులన్ 97 ఇన్నింగ్స్ల ద్వారా 1003 పరుగులు సాధించింది. అలాగే 164 ఇన్నింగ్స్ల ద్వారా 199 వికెట్లను తన ఖాతాలో వేసుకుంది. మహిళల వన్డే క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన క్రీడాకారిణిగా 35 ఏళ్ల జులన్ గోస్వామి అగ్రస్థానంలో ఉన్న సంగతి విదితమే.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.