
హైదరాబాద్: సరిగ్గా ప్రపంచకప్ జరిగిన ఏడు నెలల తర్వాత మిథాలీసేన ఆడిన తొలి అంతర్జాతీయ మ్యాచ్లోనూ పైచేయి సాధించింది. టీమిండియా సత్తాచాటిన చోట మేము సైతం అంటూ మహిళా క్రికెట్ జట్టు సత్తా చాటింది. బ్యాటింగ్, బౌలింగ్లో ఆతిథ్య జట్టుపై పూర్తి ఆధిపత్యం కనబరిచి దక్షిణాఫ్రికా మహిళా జట్టును చిత్తు చేసింది. దీంతో 3మ్యాచ్ల వన్డే సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచి ఈ సీజన్ను శుభారంభాన్ని నమోదు చేసింది.
ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, స్మృతి మందన (98 బంతుల్లో 84; ఫోర్లు 8, ఒక సిక్సర్) తడాఖా చూపగా, మిథాలీ ఆకట్టుకుంది. బౌలర్లు జులన్ గోస్వామి, శిఖాపాండే అంతకు మించి దుమ్మురేపడంతో భారత్ 88 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ విధించిన 214 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో దక్షిణాఫ్రికా విఫలమైంది.
దక్షిణాఫ్రికా జట్టు 43.2 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ వాన్ నీకెర్క్ (41) ఒంటరి పోరాటం చేసినా లాభం లేకపోయింది. వోల్వర్త్ (21), కాప్ (23) ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో గోస్వామికి 4, శిఖా పాండేకు 3, పూనమ్యాదవ్కు 2 వికెట్లు దక్కాయి. మూడు మ్యాచ్ల సిరీస్లో మిథాలీ సేన 1-0 ఆధిక్యం సాధించింది.
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన మిథాలీ సేన 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. ఓపెనర్ రౌత్ (19) త్వరగానే అవుటైనా..మరో ఓపెనర్ మందన దూకుడుగా ఆడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. ఈ క్రమంలోనే 64 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది.
మందనకు వన్డేల్లో ఇది ఏడో హాఫ్ సెంచరీ, కాగా దక్షిణాఫ్రికాపై మొదటిది. మరో ఎండ్లో కెప్టెన్ మిథాలీ (45) సహకారం అందించింది. ఈ ఇద్దరూ రెండో వికెట్కు 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ గౌరవ ప్రదమైన స్కోరు సాధించగలిగింది. , కౌర్ (16), సుష్మ (16) ఫరవాలేదనిపించారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.