ఆవలింపు తప్పేమి కాదు, అది సాధారణ విషయమే. మ్యాచ్ ఓడిపోతే అభిమానుల కన్నా మేమే ఎక్కువ బాధపడతాం అని పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు. ప్రపంచకప్లో భారత్తో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ ఓటమిపై పాక్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురిపించింది. ముఖ్యంగా కెప్టెన్ సర్ఫరాజ్పై మరింత రెచ్చిపోయిన పాక్ అభిమానులు ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
తాజాగా ఓ షాపింగ్మాల్లో తన కుమారుడితో ఉన్న సర్ఫరాజ్ను ఓ అభిమాని అసభ్య పదజాలంతో దూషించాడు. నెట్టింట్లో విమర్శల నేపథ్యంలో సర్ఫరాజ్ తొలిసారిగా స్పందించాడు. ' ప్రస్తుతం సోషల్ మీడియాకు అధిక ప్రాధాన్యముంది. ఎలాంటి వార్తలు అయినా రాస్తున్నారు. వాటిని మనం నియంత్రించలేం. గతంలోనూ ఓటమిపాలైన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంది' అని సర్ఫరాజ్ అన్నారు.
'సోషల్ మీడియా వల్ల ఆటగాళ్ల మానసికస్థైర్యం దెబ్బతింటుంది. ఆటగాళ్లను విమర్శించే హక్కు అభిమానులకులు ఉంది. అది తప్పుకాదు. కానీ.. వ్యక్తిగతంగా ఆటగాళ్లను దూషించడం సరైంది కాదు. ఇలాంటి చర్యల వల్ల ఆటగాళ్ల కుటుంబాలు ఇబ్బంది పడతాయి. అభిమానులెంత భావోద్వేగంతో ఉంటారో తెలుసు. మ్యాచ్ గెలిస్తే ఆకాశానికి ఎత్తుకుంటారు. ఓడిపోతే బాధపడతారు. అభిమానుల కన్నా మేమే ఎక్కువ బాధపడతాం. ఆవలింపు తప్పేమి కాదు, అది సాధారణ విషయమే' అని సర్ఫరాజ్ తెలిపారు.
ప్రపంచకప్లో ఇప్పటివరకు ఐదు మ్యాచ్లు ఆడిన పాక్.. మూడు మ్యాచ్లలో ఓడి, ఇంగ్లాండ్పై విజయం సాధించింది. మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. పాక్ మూడు పాయింట్లతో ప్రస్తుతం తొమ్మిదో స్థానంలో ఉంది.. సెమీస్కు చేరాలంటే పాక్ మిగతా నాలుగు మ్యాచ్ల్లోనూ గెలవాలి. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో 308 పరుగులు చేసింది.