IND vs PAK: టీ20 వరల్డ్ కప్ 2026లో భాగంగా ఆదివారం కొలంబో వేదికగా దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా-పాక్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసింది. ఈ కీలక మ్యాచ్కు ముందే వేడి రాజుకుంది. ముఖ్యంగా గత కొంతకాలంగా కొనసాగుతున్న 'నో హ్యాండ్షేక్' వివాదం ఈ మ్యాచ్తో ముగుస్తుందా ? లేదా? అనే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దీనిపై పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి.
హ్యాండ్షేక్ వివాదంపై పాక్ కెప్టెన్ ఏమన్నారంటే?
ఆసియా కప్ నుంచి టీమిండియా ఆటగాళ్లు పాకిస్థాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయడం లేదని సంగతి తెలిసిందే. పహల్గాం దాడులకు నిరసనగా టీమిండియా ఈ నిర్ణయం తీసుకుంది. శనివారం జరిగిన మీడియా సమావేశంలో దీనిపై సల్మాన్ అలీ ఆఘాను ప్రశ్నించగా.. "క్రీడలను క్రీడా స్ఫూర్తితోనే ఆడాలి. దీనిపై నా వ్యక్తిగత అభిప్రాయం ముఖ్యం కాదు, కానీ క్రికెట్ ఏ పద్ధతిలో ఆడాలో అదే పద్ధతిలో సాగాలి. షేక్ హ్యాండ్ ఇవ్వాలా వద్దా అనేది వారి (టీమిండియా) నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. రేపు మైదానంలో ఏం జరుగుతుందో చూద్దాం" అని బదులిచ్చారు. దీనిపై భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇంకా స్పందించాల్సి ఉంది.

స్టేడియానికి జై షా.. కీలక సమావేశం?
ఈ కీలక మ్యాచ్కు ఐసీసీ చీఫ్ జై షా హాజరయ్యే అవకాశం ఉంది. మ్యాచ్ సందర్భంగా భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుల ప్రతినిధులతో ఆయన అనధికారికంగా సమావేశం కావచ్చని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో ఆయా బోర్డుల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను చక్కదిద్దేందుకు ఈ సమావేశం కీలకం కానుంది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం బుల్బుల్ కూడా ఈ మ్యాచ్కు హాజరవుతున్నట్లు ధ్రువీకరించారు.
టీ20ల్లో భారత్ వర్సెస్ పాక్?
గణాంకాల పరంగా చూస్తే పాకిస్థాన్పై టీమిండియాదే పైచేయిగా ఉంది. ఇరు జట్లు 16 మ్యాచ్ లు ఆడగా.. భారత్ 12 మ్యాచ్లలో విజయం సాధించింది. మూడింటిలో పాకిస్థాన్ గెలుపొందగా.. మరో మ్యాచ్ టై (2007 వరల్డ్ కప్) అయింది. ప్రపంచకప్ వేదికపై ఈ ఇరు జట్లు తలపడటం ఇది తొమ్మిదోసారి. రికార్డులు భారత్కు అనుకూలంగా ఉన్నప్పటికీ, చిరకాల ప్రత్యర్థుల పోరులో ఏదైనా జరగొచ్చని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.