India vs Pakistan: టీ20 వరల్డ్ కప్ 2026లో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కేవలం మైదానంలోనే కాదు.. తెరవెనుక కూడా భారీ డ్రామాకు దారితీసింది. మొదట భద్రతా కారణాలు లేదా ఇతర దౌత్యపరమైన అంశాల దృష్ట్యా భారత్తో ఆడేందుకు పాకిస్థాన్ విముఖత చూపింది. ఈ ప్రతిష్టంభన కారణంగా టోర్నీ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్న తరుణంలో శ్రీలంక అధ్యక్షుడు అనూర కుమార దిస్సానాయకే రంగంలోకి దిగారు. ఫిబ్రవరి 9వ తేదీ రాత్రి ఆయన నేరుగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్కు ఫోన్ చేసి క్రికెట్ అభిమానుల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని పంతాలు వీడాలని కోరారు. ఈ ఒక్క ఫోన్ కాల్ పాక్ వైఖరిని పూర్తిగా మార్చేసిందని తెలుస్తోంది.
అసలైన హీరో ఆయనే..
పాకిస్థాన్ క్రికెట్ బోర్ఢు ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడిస్తూ.. శ్రీలంక అధ్యక్షుడిని ఈ మ్యాచ్కు "అసలైన హీరో"గా అభివర్ణించారు. "మాకు భారత్తో ఆడే విషయంలో అనేక అభ్యంతరాలు ఉండేవి. కానీ శ్రీలంక అధ్యక్షుడు మా ప్రధానితో మాట్లాడిన వెంటనే పరిస్థితి మారిపోయింది. ప్రధాని నాకు స్వయంగా ఫోన్ చేసి, ఇక ఏ చర్చలు లేవు, మనం భారత్తో మ్యాచ్ ఆడాల్సిందే అని ఆదేశించారు" అని మొహ్సిన్ నఖ్వీ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు 200 కోట్ల మంది క్రికెట్ ప్రేమికుల వినోదం కోసం శ్రీలంక చూపిన చొరవను ఆయన మనస్ఫూర్తిగా అభినందించారు.

ఇక మైదానంలో జరిగిన పోరు విషయానికి వస్తే, భారత్ తన చిరకాల ప్రత్యర్థిపై సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్లో టీమిండియా 61 పరుగుల భారీ తేడాతో పాకిస్థాన్ను చిత్తు చేసింది.. ముఖ్యంగా భారత యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ 77 పరుగులతో మెరుపు దాడి చేసి జట్టుకు భారీ స్కోరును అందించాడు. బౌలర్లు కూడా సమిష్టిగా రాణించడంతో పాక్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఈ విజయంతో భారత్ టోర్నీలో వరుసగా మూడవ విజయాన్ని నమోదు చేసి.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
పాకిస్థాన్ ఆశలు నెరవేరేనా?
ఇదిలా ఉండగా.. నేడు అందరి కళ్లు పాకిస్థాన్, నమీబియా జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ పైనే ఉన్నాయి. ఈ మ్యాచ్ ఫలితం పాకిస్థాన్ సూపర్-8 ఆశలను నిర్ణయించనుంది. ఒకవేళ కొలంబోలో వర్షం పడి మ్యాచ్ రద్దయినా లేదా పాక్ విజయం సాధించినా.. వారు నేరుగా సూపర్-8 దశకు చేరుకుంటారు. అయితే ఒకవేళ నమీబియా సంచలనం సృష్టించి పాకిస్థాన్ను ఓడిస్తే మాత్రం నెట్ రన్ రేట్ పరంగా మెరుగ్గా ఉన్న అమెరికా (USA) తదుపరి దశకు వెళ్తుంది, పాక్ ఇంటిబాట పడుతుంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం వర్షం పడే అవకాశం ఎక్కువగా ఉండటంతో, అది పాకిస్థాన్కు కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది.