కోల్కతా: టీమిండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ తన తన వ్యక్తిత్వాన్ని మరోసారి నిరూపించుకున్నాడు. ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా శనివారం పాకిస్తాన్, భారత జట్లు తలపడనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరు జట్టు శుక్రవారం మైదానంలో పాక్టీస్ చేశాయి.
ఈ ప్రాక్టీస్ సందర్బంగా మైదానంలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. విరాట్ కోహ్లీ, పాకిస్తాన్ కెప్టెన్ షాహిద్ అఫ్రీది సరదాగా ముచ్చటించుకున్నారు. వీరి సంభాషణ పూర్తయ్యే ముందుగా అక్కడకి దగ్గరలో ప్రాక్టీస్ చేస్తున్న అమీర్ను కోహ్లీ పిలిచాడు.

ఓ బ్యాట్ను కోహ్లీ అమీర్కు బహుమతిగా ఇచ్చాడు. ఆ బ్యాట్తోనే అమీర్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించాడు. అంతేకాదు, పాక్కు సంబంధించిన ఇతర ఆటగాళ్లు కూడా ఆ బ్యాట్ను తీసుకుని సరదాగా ప్రాక్టీస్ చేశారు. పోటీ అనేది కేవలం ఆటలో మాత్రమేనని, వ్యక్తిగతంగా ఉండకూడదని కోహ్లీ నిరూపించాడు.
ఈ వీడియో ఇప్పుడు నెట్లో హల్చల్ చేస్తోంది. అమీర్పై గతంలో కూడా కోహ్లీ తన ఇష్టాన్ని వ్యక్తపరిచిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ ఇచ్చిన బ్యాట్తోనే మ్యాచ్ అడుతానని కూడా అమీర్ చెప్పాడు. ఆసియా కప్ పోటీల్లో భాగంగా తమపై జరిగిన మీర్పూర్ మ్యాచులో 18 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నందుకు అమీర్ను కోహ్లీ ప్రశంసించాడు కూడా.
ఆసియా కప్ పూర్తయిన తర్వాత అమీర్ కోహ్లీని కలిసి తనకు ఓ బ్యాట్ బహుమతిగా ఇవ్వాలని అడిగినట్లు సమాచారం.