మరో ఎనిమిది రోజుల్లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ మెగా సమరానికి అమెరికా, వెస్టిండీస్ ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా ఈ సారి పొట్టి ప్రపంచకప్లో 20 దేశాలు పాల్గొంటున్నాయి. ఈ మొత్తం దేశాలను అయిదు జట్ల చొప్పున నాలుగు గ్రూప్లుగా విభజించారు. గ్రూప్-ఏ చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్తో పాటు ఐర్లాండ్, కెనడా, యూఎస్ఏ ఉన్నాయి.
ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాక్ మ్యాచ్ జూన్ 9న జరగనుంది. ఈ హైవోల్టేజ్ మ్యాచ్కు న్యూయార్క్ వేదికగా కానుంది. అయితే ఈ హోరాహొరీ పోరుకు ఉన్న క్రేజ్ను అర్థం చేసుకున్న ఐసీసీ టికెట్ల ధరను భారీగా పెంచేసింది. డైమండ్ క్లబ్ విభాగంలోని ఒక్కో సీటును 20 వేల అమెరికా డాలర్లకు విక్రయిస్తున్నారు. అంటే సుమారు రూ.16.65 లక్షలు.

దీంతో లాభాన్ని అర్జించడం కోసం టికెట్ ధరలను అమాంతం పెంచిన ఐసీసీ విధానంపై చర్చనీయాంశంగా మారింది. ఆటను విస్తారించాలని భావిస్తున్నామని చెప్పి, లాభాల కోసం ఐసీసీ ప్రయత్నిస్తుందని విమర్శలు వస్తున్నాయి. ఐసీసీపై ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీ తీవ్ర విమర్శల చేశారు.
''టీ20 వరల్డ్ కప్లో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్కు డైమండ్ క్లబ్లోని ఒక్కో సీటు టికెట్ను ఐసీసీ 20 వేల డాలర్లకు విక్రయిస్తోందని తెలిసి షాకయ్యా. అమెరికాలో ఈ ప్రపంచకప్ను నిర్వహించడానికి ముఖ్య కారణం ఆటను విస్తరించడం, అభిమానులను సంపాదించుకోవడం. అంతేకానీ, టికెట్ల విక్రయాలపై లాభం పొందడానికి కాదు'' అని లలిత్ మోదీ ట్వీట్ చేశారు.
అయితే ఐసీసీ ప్రకారం భారత్-పాకిస్థాన్ మ్యాచ్ టికెట్ల ధరలు 300 నుంచి పది వేల డాలర్ల వరకూ ఉన్నాయి. అంటే సుమారు రూ. 25వేల నుంచి రూ.8.32 లక్షలు. కాగా, గ్రూప్ స్టేజ్లో టాప్-2లో నిలిచిన జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. సూపర్-8కు క్వాలిఫై అయిన టీమ్స్ను రెండు గ్రూప్లుగా విభజిస్తారు. గ్రూప్-1, గ్రూప్-2లో అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు సెమీఫైనల్స్కు చేరుకుంటాయి. భారత్ సెమీస్కు చేరుకుంటే జూన్ 27న గయానా వేదికగా మ్యాచ్ నిర్వహిస్తారు. బార్బడోస్ వేదికగా జూన్ 29న ఫైనల్ జరగనుంది.