టీ20 ప్రపంచ కప్ 2026లో క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ మహా సమరానికి వర్షం ముప్పు పొంచి ఉంది. ఆదివారం కొలంబోలోని ఆర్.ప్రేమదాస స్టేడియంలో ఈ మ్యాచ్ జరగాల్సి ఉండగా.. శనివారం సాయంత్రమే అక్కడ వాతావరణం మారిపోయింది. శనివారం సాయంత్రం కొలంబోలో తేలికపాటి వర్షం ప్రారంభమైంది. దీంతో స్టేడియం సిబ్బంది వెంటనే అప్రమత్తమై పిచ్తో పాటు గ్రౌండ్ మొత్తాన్ని కవర్లతో కప్పేశారు. ఆకాశం మేఘావృతమై ఉండటంతో అర్ధరాత్రి వరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈ అకాల వర్షాలు కురుస్తున్నాయని శ్రీలంక వాతావరణ కేంద్రం తెలిపింది.
ఆదివారం పరిస్థితి ఏంటి? మ్యాచ్ రద్దవుతుందా?
శ్రీలంక వాతావరణ శాఖ నివేదిక ప్రకారం.. ఆదివారం మ్యాచ్ జరిగే సమయంలో కొలంబోలో 70శాతం వరకు వర్షం కురిసే అవకాశం ఉంది. ఒకవేళ వర్షం అంతరాయం కలిగిస్తే.. కనీసం ఫలితం తేలాలంటే ఇరు జట్లు తలా 5 ఓవర్లు ఆడాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో మ్యాచ్ జరగాలంటే వర్షం తగ్గుముఖం పట్టాలి. అదృష్టవశాత్తూ.. ఆర్.ప్రేమదాస స్టేడియంలో డ్రైనేజీ వ్యవస్థ చాలా అత్యాధునికంగా ఉంది. వర్షం ఆగిపోయిన 20 నిమిషాల్లోనే మైదానాన్ని సిద్ధం చేసే సౌకర్యం ఇక్కడ ఉంది.

టీమిండియా వ్యూహాలు.. అభిషేక్ శర్మపై ఆశలు
మరోవైపు టీమిండియా ఈ మ్యాచ్లో గెలిచి పాకిస్థాన్పై తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని పట్టుదలతో ఉంది. స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఫిట్నెస్ సాధించి తుది జట్టులోకి వస్తాడని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. మిడిలార్డర్ బలంగా ఉండటంతో భారత్ ఈ మ్యాచ్లో ఫేవరెట్గా కనిపిస్తోంది. అయితే, ప్రకృతి సహకరిస్తేనే ఈ 40 ఓవర్ల మజాను అభిమానులు ఆస్వాదించగలరు.