
లండన్: ప్రపంచకప్లో హాట్ ఫేవరెట్గా బరిలో దిగిన టీమిండియా.. అంచనాలకు అనుగుణంగానే ఆడుతోంది. ప్రత్యర్థిపై దూకుడు వ్యూహాన్ని అనుసరిస్తోంది. బెంబేలెత్తిస్తోంది. ఆడిన మూడు మ్యాచుల్లో రెండింట్లో ఘన విజయాన్ని సాధించింది. వర్షం వల్ల భారత్-కివీస్ మధ్య మ్యాచ్ రద్దు కావడంతో ఒక పాయింట్ను తన ఖాతాలో వేసుకోగలిగింది. అయిదు పాయింట్లతో మూడోస్థానంలో కొనసాగుతోంది కోహ్లీసేన.
తన తరువాతి మ్యాచ్లో దాయాది దేశం పాకిస్తాన్ను ఎదుర్కోబోతంది. మాంఛెస్టర్లోని ఓల్డ్ ట్రాఫర్డ్ స్టేడియంలో ఆదివారం ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. పాకిస్తాన్ స్పీడ్స్టర్ మహమ్మద్ అమీర్ భారత బ్యాట్స్మెన్లను కట్టడి చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. అమీర్ రూపంలో గండం ఎదురు కావచ్చని అభిప్రాయపడుతున్నారు. అతణ్ని అడ్డుకోవడానికి ప్రత్యేకంగా వ్యూహాలను రచించుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో అమీర్ తన బౌలింగ్తో టీమిండియాను బెదరగొట్టాడు.
ప్రపంచకప్ టోర్నీలో మాంచి ఊపు మీదున్నాడు అమీర్. ప్రస్తుతానికి లీడింగ్ వికెట్ టేకర్ అతనే. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో కూడా శ్లాగ్ ఓవర్లను అద్భుతంగా ముగించాడతను. కనీసం 330-340 వరకు పరుగులు చేసేలా కనిపించిన ఆసీస్ బ్యాట్స్మెన్లను తన పదునైన, వైవిధ్యమైన బౌలింగ్తో కట్టడి చేశాడు. ముప్పతిప్పలు పెట్టాడు. అమీర్ ధాటికి 308 పరుగులకే పరిమితమైంది ఆసీస్ టీమ్. ఈ మ్యాచ్లో అమీర్ 30 పరుగులకు అయిదు వికెట్లను పడగొట్టాడు.
అదే ఊపును అమీర్ టీమిండియా మ్యాచ్లో కూడా కొనసాగించాలని కోరుకుంటోంది సర్ఫరాజ్ జట్టు. శ్లాగ్ ఓవర్లలో చెలరేగిపోయే టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్మెన్లను అమీర్ ఒక్కడే కట్టడి చేయగలడని ఆశిస్తోంది. అతని ఫామ్ చూస్తోంటే.. సాధ్యమయ్యేలానే కనిపిస్తోందని అంటున్నారు విశ్లేషకులు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
అమీర్ను ఎదుర్కొనడానికి టీమిండియా పక్కా వ్యూహాన్ని అనుసరించాల్సి ఉంటుందని అన్నారు. సానుకూల దృక్పథంతో అతణ్ని ఎదుర్కోవాలని సూచించారు. అమీర్ సంధించే బంతి ఎలాంటిదనే విషయాన్ని ముందే పసిగట్టగలిగితే- అతనిపై ఎదురుదాడికి దిగడం పెద్ద కష్టమేమీ కాదని అంటున్నారాయన. అమీర్ సంధించే బంతులను వదిలేయకుండా పరుగులు చేయడానికి ప్రయత్నించి, అతని మీద ఒత్తిడిని తీసుకుని రావచ్చని విశ్లేషించారు సచిన్.