

న్యూఢిల్లీ: ఆసియాకప్లో భాగంగా బుధవారం భారత్-పాక్ మధ్య జరిగిన మ్యాచ్లో టీమిండియా ఘనవిజయం సాధించింది. ఈ విజయంపై టీమిండియా బౌలర్లను పొగుడుతున్న క్రమంలో ప్రశంసలన్నీ ప్రత్యేకంగా కేదర్ జాదవ్కే చెందుతున్నాయి. చాలా కాలం తర్వాత జట్టులోకి వచ్చిన జాదవ్.. పాక్ బ్యాటింగ్ వెన్ను విరిచాడు. భారత్ విజయం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జాదవ్ మాట్లాడాడు.
ప్రస్తుతం తన ఫిట్నెస్ పరిస్థితి మెరుగ్గా ఉందని అందువల్లే పాక్తో మ్యాచ్లో రాణించగలిగానని అన్నాడు. తాను సర్జరీ చేయించుకున్న తర్వాత ఫిట్నెస్ మరింత మెరుగైందని తెలిపాడు. నాలుగు నెలల కాలంలో దీనిపై తాను ఎంతో పట్టు సాధించానని పేర్కొన్నాడు. తనలోని ఆత్మవిశ్వాసం మునుపటి కంటే రెట్టింపైందని చెప్పుకొచ్చాడు.
ఈ సందర్భంగా జాదవ్ మాట్లాడుతూ..'ఇంతకు ముందు మ్యాచ్లో చేసిన తప్పిదాలను మరో మ్యాచ్లో పునరావృతం చేయకుండా ప్రయత్నిస్తాను. బుధవారం జరిగిన మ్యాచ్లో నాలో పెరిగిన ఆత్మవిశ్వాసం నాకెంతో సహకరించింది. అంతేకాకుండా టీమిండియాలో నాకో ప్రత్యేకత కల్పించేలా చేసింది. ఫిట్నెస్ను పెంచుకోవడానికి మరింత కష్టపడతాను.'
'రోజూ ఉదయాన్నే జిమ్ లేదా రన్నింగ్ చేస్తాను. జట్టులో ఉన్న సీనియర్ ఆటగాళ్ల సలహాలు తీసుకుంటాను. నిజం చెప్పాలంటే నేను నెట్స్లో ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎక్కువగా బౌలింగ్ చేయను. రెండు ఓవర్ల పాటు మాత్రమే బౌలింగ్ చేస్తాను. ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే మైదానంలో సరైన ప్రదర్శన చేయలేనేమోనని సందేహం వస్తుంది. అందుకే నా హద్దుల్లో ఉంటాను' అని తెలిపాడు.