
హైదరాబాద్: కౌలాలంపూర్ వేదికగా జరుగుతున్న ఆసియాకప్ టీ20 టోర్నీలో భారత మహిళల జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భారత మహిళల జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పాకిస్థాన్ నిర్దేశించిన 73 పరుగుల లక్ష్యాన్ని భారత్ 16.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
దీంతో ఈ టోర్నీలో నాలుగో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న హర్మన్ప్రీత్ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ టో్ర్నీలో అంతకముందు మలేసియా, థాయ్లాండ్, శ్రీలంక జట్లపై భారత్ మహిళల జట్టు విజయాల్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాక్ మహిళల జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.
ఓపెనర్ నహీదా ఖాన్(18), సనా మీర్(20) మాత్రమే రెండంకెల స్కోరును దాటగా, మిగతా వారు ఘోరంగా విఫలమయ్యారు. నలుగురు ఐదు పరుగులలోపే పెవిలియన్కు చేరడం విశేషం. దీంతో పాకిస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 72 పరుగులు మాత్రమే చేయగలిగింది.
భారత బౌలర్ ఏక్తా బిస్త్ మెరుగైన గణాంకాలు నమోదు చేసింది. నాలుగు ఓవర్లు వేసిన బిస్త్ 14 పరుగులు ఇచ్చి 3 వికెట్లను దక్కించుకుంది. మిగతా బౌలర్లలో శిఖా పాండే, అంజూ పటేల్, పూనమ్ యాదవ్, దీప్తి శర్మ తలో వికెట్ తీశారు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.
మిథాలీ రాజ్ డకౌట్ నిష్క్రమించడంతో భారత్ పరుగుకే వికెట్ను కోల్పోయింది. ఆ తర్వాత దీప్తి శర్మ(0) సైతం పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ బాటపట్టింది. అనంతరం స్మృతి మంధాన(38), కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్(34 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడటంతో భారత్ మరో 23 బంతులుండగానే విజయం సాధించింది.