హైదరాబాద్: నిర్లక్ష్యపు బౌలింగ్ కారణంగా టీమిండియా గతంలో భారీ మూల్యం చెల్లించుకున్న సందర్భాలు అనేకం. నోబాల్స్ కారణంగా టీమిండియా అనేక మ్యాచ్ల్లో ఓటమి కూడా పాలైంది. తాజాగా ఇంగ్లాండ్ వేదికగా పాకిస్థాన్తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టీమిండియా ఆదిలోనే భారీ మూల్యం చెల్లించుకుంది.
భారత పేసర్ బుమ్రా వేసిన నాలుగో ఓవర్ తొలి బంతికి పాక్ ఓపెనర్ ఫకార్ కీపర్ ధోనీకి క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. అంపైర్ కూడా అవుట్గా ప్రకటించాడు. దీంతో టీమిండియా అభిమానులు సంబరాల్లో మునిగారు. అయితే అంతలోనే అది నాటౌట్ అంటూ అంపైర్ మరోమారు ప్రకటించాడు.
బుమ్రా వేసిన నాలుగో ఓవర్ తొలి బంతి నోబాల్ కావడంతో అంఫైర్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. అంపైర్ నాటౌట్గా ప్రకటించడంతో ఫకార్ ముఖంలో చిరునవ్వు కనిపించింది. ఆ సమయంలో ఫకార్ జమాన్ వ్యక్తిగత స్కోరు 3. ఈ లైఫ్తో బతికిపోయిన ఫకార్ జమాన్ ఆ తర్వాత అద్భుతమైన సెంచరీతో పాక్ భారీ స్కోరుకు బాటలు వేశాడు.
అయితే ఆ తర్వాత జట్టు స్కోరు 200 పరుగుల వద్ద ఓపెనర్ ఫకార్ జమాన్ వికెట్ కోల్పోయింది. 106 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 114 పరుగులు చేసిన ఫకార్ పాండ్యా బౌలింగ్లో జడేజాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. 33.1 ఓవర్లకు గాను పాకిస్తాన్ 2 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది.
2016లో జరిగిన ఐసీసీ వరల్డ్ ట్వంటీ 20లో కూడా ఇలానే జరిగి భారత్ ఓటమి పాలైంది. వెస్టిండీస్తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. అప్పుడు బూమ్రా వేసిన నో బాల్ వల్లే విండీస్ సునాయాసంగా గెలిచి ఫైనల్కు చేరింది.
లెండిల్ సిమన్స్ను ముందులోనే బూమ్రా అవుట్ చేసినప్పటికీ, అది నో బాల్ కావడంతో అతను బతికిపోయాడు. ఆపై మ్యాచ్ విన్నింగ్స్ ఇన్నింగ్స్ ఆడాడు. ఒకవేళ ఆదివారం ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న పైనల్లో ఫలితం పాకిసాన్కు అనుకూలంగా ఉంటే మాత్రం అది బూమ్రా నో బాలే కారణం అవుతుందని క్రికెట్ విశ్లేషకులు మండిపడుతున్నారు.