
భారత్-పాక్ స్పెషల్ అట్రాక్షన్
రెండో మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ ఢీ కొనబోతోన్నాయి. ఇదే దుబాయ్ స్టేడియంలో ఆదివారం సాయంత్రం 7:30 గంటలకు ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా బాబర్ ఆజమ్ సేనతో తలపడనుంది. సుదీర్ఘ విరామం అనంతరం ఈ రెండు జట్ల మ్యాచ్ జరగనుంది. భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే దాన్ని మ్యాచ్గా మాత్రమే చూడరు అభిమానులు. అంతకుమించి అనే స్థాయిలో ఉంటుంది.

నెట్ ప్రాక్టీస్లో టీమిండియా ప్లేయర్లు..
బాబర్ ఆజమ్ సారథ్యంలో బలమైన జట్టుగా ఆవిర్భవించిన పాకిస్తాన్ జట్టును ఢీ కొట్టడానికి టీమిండియా శ్రమిస్తోంది. నెట్ ప్రాక్టీస్లో చెమటోడుస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, భువనేశ్వర్ కుమార్, విరాట్ కోహ్లీ, దీపక్ హుడా, రవీంద్ర జడేజా, సూర్యకుమార్ యాదవ్.. ఇలా టీమ్ మొత్తం నెట్లో గంటల తరబడి ప్రాక్టీస్ చేస్తోంది. హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పర్యవేక్షణలో ప్లేయర్లు రాటుదేలుతున్నారు.
మోస్ట్ ఎమోషనల్ గేమ్..
భారత్-పాకిస్తాన్ మధ్య దశాబ్దాల కాలంగా శతృత్వం కొనసాగుతోంది. రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతటి ఉద్రిక్త పరిస్థితులు సుదీర్ఘకాలం నుంచీ కొనసాగుతూ వస్తోన్నాయి. క్రికెట్లోనూ ఇదే రకమైన భావోద్వేగాలు ఉంటాయి. ఏ టీమ్ గెలిచినా ఆ దేశంలో సంబరాలు అంబరాన్ని అంటుతుంటాయి. ఆకాశమే హద్దుగా అభిమానులు పండగ చేసుకుంటారు. జాతీయ పతాకాన్ని చేతపట్టుకుని సందడి చేయడం సర్వ సాధారణం. బైక్లు, కార్లతో ర్యాలీలను నిర్వహిస్తుంటారు.

సరిహద్దులు దాటిన అభిమానం..
ఈ పరిణామాల మధ్య దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం కనిపించింది. టీమిండియా ప్లేయర్లు ప్రాక్టీస్ చేస్తోన్న సమయంలో కొందరు పాకిస్తాన్ అభిమానులు రోహిత్ శర్మను కలవడానికి వచ్చారు. ప్లేయర్లను ఎవరూ కలవనివ్వకుండా ఏర్పాటు చేసిన కంచెకు అవతలి నుంచే వారు హిట్మ్యాన్ గ్రీట్ చేశారు. రోహిత్ శర్మ స్వయంగా వారిని కలిశాడు. షేక్ హ్యాండ్ ఇచ్చాడు. కంచెకు అవతలి నుంచే వారు రోహిత్ శర్మను హగ్ చేసుకున్నారు.

రోహిత్ను చూడ్డానికే పాక్ నుంచి వచ్చాం..
తమ ఆరాధ్య క్రికెటర్ రోహిత్ శర్మను చూడ్డానికి, ఆయనను కలుసుకోవడానికి తాము పాకిస్తాన్ నుంచి వచ్చామని ఇద్దరు అభిమానులు చెప్పారు. రోహిత్ను ఓ అద్భుతంగా అభివర్ణించారు. తమను కలుసుకోవడానికి రోహిత్ శర్మ అదే పనిగా తమను కలుసుకోవడానికి నెట్ ప్రాక్టీస్ను వదిలి గ్రౌండ్ నుంచి వచ్చాడని, ఆయన గ్రేట్ పర్సన్ అనడానికి ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ మరొకటి ఉండబోదని అన్నారు. డౌన్ టు ఎర్త్ అనే పదాలకు రోహిత్ నిలువెత్తు సాక్ష్యమని పాకిస్తాన్ అభిమానులు చెప్పారు.


Click it and Unblock the Notifications
