
షార్జా: అచ్చొచ్చిన గడ్డపై భారత క్రికెట్ జట్టు చెలరేగుతోంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతున్న ఆసియా కప్ 2022 టోర్నమెంట్పై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. గ్రూప్-ఏలో భాగంగా ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్లల్లోనూ విజయఢంకా మోగించింది. ఈ గ్రూప్లో అగ్రస్థానంలో నిలిచింది. రెండో రౌండ్కు అలవోకగా అర్హత సాధించింది. సూపర్ 4లో పాకిస్తాన్తో తలపడడానికి సన్నద్ధమౌతోంది.
భారత్తో పాటు పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ సూపర్ 4కు అర్హత సాధించాయి. రెండో రౌండ్లో ఈ నాలుగు జట్లు కూడా మూడేసి చొప్పున మ్యాచ్లను ఆడతాయి. టీమిండియా తొలుత పాకిస్తాన్, అనంతరం శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్లను ఎదుర్కొంటుంది. పాకిస్తాన్తో మ్యాచ్ ఆదివారం షెడ్యూల్ అయింది. 6వ తేదీన శ్రీలంకతో తలపడుతుంది. 8వ తేదీన ఆఫ్ఘనిస్తాన్ను ఢీ కొడుతుంది. సరిగ్గా వారం రోజుల తరువాత పాకిస్తాన్ను మరోసారి ఎదుర్కొనబోతోంది.
గత ఆదివారం ఆసియా కప్ గ్రూప్ దశలో ఈ రెండు దేశాలు తలపడ్డాయి. తన చిరకాల ప్రత్యర్థిపై టీమిండియా ఏకపక్షంగా విజయాన్ని సాధించింది. అయిదు వికెట్ల తేడాతో బాబర్ ఆజమ్ సారథ్యంలోని పాక్ను మట్టి కరిపించింది. ఇప్పుడిక రెండో రౌండ్లో మరోసారి పాక్తో బిగ్ ఫైట్కు సన్నద్ధమౌతోంది. ఈ సండే కూడా బ్లాక్ బస్టర్గా మారింది క్రికెట్ అభిమానులకు. గ్రూప్ దశలో జరిగిన మ్యాచ్ను టీమిండియా ఏకపక్షంగా మార్చేసిన నేపథ్యంలో ఇదెలా ఉంటుందనేది ఉత్కంఠభరితంగామారింది.
ఈ మ్యాచ్లోనూ ఘన విజయం సాధించడానికి టీమిండియా ప్లేయర్లు శ్రమిస్తోన్నారు. నెట్స్లో చెమటోడుస్తోన్నారు. ప్రత్యేకించి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పూర్తి డెడికేషన్తో కనిపిస్తోన్నారు. ప్రాక్టీస్ సమయంలో విరాట్ కోహ్లీ హై-ఆల్టిట్యూడ్ మాస్క్తో కనిపించాడు. ఈ మాస్క్తోనే ఫిట్నెస్ ప్రాక్టీస్ చేశాడు. రన్నింగ్ చేశాడు. ఇలాంటి హై-ఆల్టిట్యూడ్ మాస్క్ను సాధారణంగా క్రికెటర్లెవరూ వినియోగించరు. ఇలాంటివెప్పుడూ టీమిండియా ప్లేయర్లు కూడా వాడలేదు.
అథ్లెట్లు మాత్రమే దీన్ని వాడుతారు. రన్నర్లు తమ ఊపిరితిత్తులు, శ్వాస కండరాలను బలోపేతం చేయడానికి ఉపయోగిస్తుంటారు దీన్ని. ఈ టోర్నమెంట్లో విరాట్ కోహ్లీ సత్తా చాటుతున్నాడు. పాకిస్తాన్పై 35, హాంకాంగ్పై 59 పరుగులు చేశాడు. తన బ్యాటింగ్ రిథమ్ను అందిపుచ్చుకున్నాడు. అదే దూకుడును ఆదివారం నాటి మ్యాచ్లో పాకిస్తాన్పై కొనసాగించాలని కోరుకుంటోన్నాడు సగటు అభిమాని.