
దుబాయ్: ఆసియా కప్ మెగా టోర్నమెంట్ సూపర్ 4 దశలో రెండో మ్యాచ్ ఇవ్వాళ జరుగనుంది. చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్తాన్ ఢీకొట్టనున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం దీనికి వేదిక. గ్రూప్ దశలో కిందటి ఆదివారం ఈ రెండు జట్లు తలపడిన విషయం తెలిసిందే. పాకిస్తాన్పై భారత్ ఏకపక్ష విజయాన్ని సాధించిందా మ్యాచ్లో. సరిగ్గా వారం తిరిగే సరికి సూపర్ 4లో మళ్లీ ఈ రెండు జట్లు ఎదురుపడ్డాయి.
ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఈ సాయంత్రం 7:30 గంటలకు ఆరంభమౌతుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సమయం ప్రకారం చూసుకుంటే సాయంత్రం 6 గంటలకు మొదలవుతుంది. ఆసియా కప్ సూపర్ 4 దశలో ఇది రెండో మ్యాచ్. శనివారం రాత్రి జరిగిన తొలి గేమ్లో ఆఫ్ఘనిస్తాన్పై శ్రీలంక ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.
భారత్-పాకిస్తాన్ మ్యాచ్ను స్టార్ స్పోర్స్ట్ నెట్వర్క్.. ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. అలాగే- డిస్నీ ప్లస్ హాట్స్టార్ యాప్లో లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు. దీని వెబ్సైట్ కూడా మ్యాచ్ను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. అవన్నీ పెయిడ్ ఛానల్స్. ఉచితంగా చూడటానికీ అవకాశం ఉంది. దూరదర్శన్లో ఈ సౌకర్యాన్ని కల్పించిది. డీడీ స్పోర్ట్స్ ఛానల్ భారత్-పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ను ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
నిజానికి- ఆసియా కప్ 2022 టోర్నమెంట్ను డీడీ స్పోర్ట్స్ ఛానల్ మొదటి నుంచీ ప్రత్యక్ష ప్రసారం చేయట్లేదు. ఈ టోర్నమెంట్లో ఇకపై జరిగే మ్యాచ్లు కూడా ఈ ఛానల్లో లైవ్ టెలికాస్ట్ కాబోవు గానీ.. సూపర్-4 దశలో భారత్ ఆడే మ్యాచ్లను మాత్రమే డీడీ స్పోర్ట్స్ అందుబాటులోకి తీసుకుని రానుంది. ఇందులో భాగంగా భారత్-పాక్ మధ్య జరిగే మ్యాచ్తో పాటు ఎల్లుండి శ్రీలంక, 8వ తేదీన ఆఫ్ఘనిస్తాన్తో తలపడే టీమిండియా గేమ్లు కూడా ఇందులో ఉచితంగా చూసెయ్యొచ్చు.