
భారత్-పాక్ మధ్య..
సూపర్ 4లో రెండో మ్యాచ్ ఇవ్వాళ జరుగనుంది. చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్తాన్ ఢీకొట్టనున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం దీనికి వేదిక. భారత కాలమానం ప్రకారం ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. గ్రూప్ దశలో కిందటి ఆదివారం ఈ రెండు జట్లు తలపడిన విషయం తెలిసిందే. పాకిస్తాన్పై భారత్ ఏకపక్ష విజయాన్ని సాధించిందా మ్యాచ్లో. సరిగ్గా వారం తిరిగే సరికి సూపర్ 4లో మళ్లీ ఈ రెండు జట్లు ఎదురుపడ్డాయి.

కోలుకున్న పాక్..
భారత్పై పరాజయం పాలైన తరువాత పాకిస్తాన్ కోలుకుంది. తన రెండో మ్యాచ్లో హాంకాంగ్ను చిత్తు చిత్తు చేసింది. బ్యాటింగ్, బౌలింగ్లో పసికూనపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. షార్జా స్టేడియంలో శుక్రవారం రాత్రి జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 193 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ క్రమంలో రెండు వికెట్లను మాత్రమే కోల్పోయింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన హాంకాంగ్ బ్యాటింగ్ ఆర్డర్ను పాకిస్తాన్ బౌలర్లు చెల్లాచెదరు చేశారు. 38 పరుగులకే కుప్పకూల్చారు. బౌలర్ల ధాటికి 155 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది పాక్.

హాంకాంగ్పై..
భారత్తో మ్యాచ్కు ముందు పాకిస్తాన్ ఈ రేంజ్లో చెలరేగడం ప్రాధాన్యతను సంతరించుకుంది. టీమిండియాకు డేంజర్ బెల్స్ మోగించినట్టయింది. పాకిస్తాన్ చేతిలో 38 పరుగులకు కుప్పకూలిన ఇదే హాంకాంగ్ జట్టు.. గ్రూప్ దశలో భారత్పై 152 పరుగులు చేసిన విషయం తెలిసిందే. హాంకాంగ్ జట్టును ఆలౌట్ చేయలేకపోయారు టీమిండియా బౌలర్లు. ఈ రెండు మ్యాచ్ల మధ్య ఉన్న తేడాను బట్టి చూసుకుంటే.. పాకిస్తాన్ దూకుడుగా ఉన్నట్టే.

వాతావరణం ఎలా ఉంది..
ఈ మ్యాచ్కు వర్షం పడే అవకాశాలు ఏ మాత్రం లేవు. వాతావరణం వేడిగా ఉంటుంది. పగటి ఉష్ణోగ్రత 40 డిగ్రీలు, రాత్రి ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్ మేర రికార్డ్ అవుతుందని వాతావరణం కేంద్రం పేర్కొంది. రాత్రి 9 గంటల తరువాత గాలిలో తేమ 61 శాతం వరకు ఉండొచ్చు. 10 నుంచి 15 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తుంది. ఇది రెండోసారి బ్యాటింగ్ చేసే జట్టు జయాపజయాల్లో కీలక పాత్ర పోషిస్తుందనే అంచనాలు ఉన్నాయి.

ఛేజింగ్కు అనుకూలం..
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం పిచ్ సాధారణంగా బ్యాటింగ్కు అనుకూలంగా ఉంటుంది. రెండోసారి బ్యాటింగ్ చేసిన జట్టుకు ఎక్కువ విజయాలను అందించింది. గ్రూప్ దశలో భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా ఇదే విషయాన్ని ప్రూవ్ చేసింది. టాస్ గెలిచిన టీమిండియా కేప్టెన్ రోహిత్ శర్మ మరో ఆలోచన లేకుండా తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అంచనాలకు అనుగుణంగా పాకిస్తాన్ను కట్టడి చేశారు. ఇప్పుడు కూడా అదే గేమ్ ప్లాన్ను అనుసరించడం ఖాయం. టాస్ గెలిస్తే- తొలుత ఫీల్డింగ్ వైపే మొగ్గు చూపొచ్చు రోహిత్ శర్మ.


Click it and Unblock the Notifications
