
దుబాయ్: ఆసియా కప్ మెగా టోర్నమెంట్ సూపర్ 4 దశలో రెండో మ్యాచ్ ఇవ్వాళ జరుగనుంది. చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్తాన్ ఢీకొట్టనున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం దీనికి వేదిక. గ్రూప్ దశలో కిందటి ఆదివారం ఈ రెండు జట్లు తలపడిన విషయం తెలిసిందే. పాకిస్తాన్పై భారత్ ఏకపక్ష విజయాన్ని సాధించిందా మ్యాచ్లో. సూపర్ 4లో మళ్లీ ఈ ఆదివారం ఈ రెండు జట్లు ఎదురుపడ్డాయి.
ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఈ సాయంత్రం 7:30 గంటలకు ఆరంభమౌతుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సమయం ప్రకారం చూసుకుంటే సాయంత్రం 6 గంటలకు మొదలవుతుంది. ఆసియా కప్ సూపర్ 4 దశలో ఇది రెండో మ్యాచ్. శనివారం రాత్రి జరిగిన తొలి గేమ్లో ఆఫ్ఘనిస్తాన్పై శ్రీలంక ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. కీలకమైన ఈ మ్యాచ్కు ఆల్రౌండర్ రవీంద్ర జడేజా దూరం అయ్యాడు. అతని స్థానంలో అక్షర్ పటేల్ జాయిన్ అయ్యాడు. జ్వరం వల్ల పేస్ బౌలర్ అవేష్ ఖాన్ కూడా ఆడే పరిస్థితి లేదు.
గత ఆదివారం జరిగిన మ్యాచ్లో భారత్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు ఆల్ రౌండర్ ఆర్థిక్ పాండ్యా. తొలుత బౌలింగ్లో.. ఆ తరువాత బ్యాటింగ్లో చెలరేగాడీ గుజరాతీ ప్లేయర్. ఆల్ రౌండ్ పెర్ఫార్మెన్స్తో అదరగొట్టాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 25 పరుగులు ఇచ్చి- మూడు వికెట్లు తీశాడు. క్రీజ్లో కుదురుకున్న ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ను పెవిలియన్ దారి పట్టించాడు. ఫస్ట్ డౌన్ బ్యాటర్ ఫకర్ జమాన్ను అవుట్ చేశాడు. వచ్చీ రాగానే ఖుష్దిల్ షానూ వెనక్కి పంపాడు.
ఈ మూడు వికెట్లు కూడా షార్ట్ అండ్ హార్డ్ లెంగ్త్ బంతులతోనే సాధించాడు హార్దిక్ పాండ్యా. అవే తన ప్రధాన అస్త్రాలనీ చెప్పుకొచ్చాడు. వాటిని తరచూ ప్రయోగిస్తుంటాననీ పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్ సందర్భంగా వెల్లడించాడు. ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా నుంచి వెలువడే బంతులను ఎదుర్కొనడానికి పాకిస్తాన్ జట్టు పెద్ద ప్లానే వేసింది. కౌంటర్ అటాక్కు దిగాలని నిర్ణయించుకుంది. హార్దిక్ పాండ్యా బంతులను ఎదుర్కొనే బ్యాటర్ అటాకింగ్ మోడ్లో ఉండాలని, దూకుడుగా ఆడుతూ పాండ్యాను ఒత్తిళ్లకు గురి చేయాలని నిర్ణయించుకుంది.
హార్దిక్ పాండ్యా బ్యాటింగ్కు దిగిన సమయంలో లెగ్ స్టంప్స్ను టార్గెట్గా చేసుకుని బంతులను సంధించాలని పాకిస్తాన్ గేమ్ ప్లాన్గా రూపొందించుకుందనే అంచనాలు ఉన్నాయి. లైన్ అండ్ లెంగ్త్కు కట్టుబడి ఉంటూ బంతిని అనుకున్న ప్రదేశంలో ల్యాండ్ చేయగలిగితే హార్దిక్ పాండ్యా ఇబ్బంది పడతాడని పాకిస్తాన్ కోచ్ సక్లయిన్ ముస్తాక్ హితబోధ చేశాడు. పాండ్యా బ్యాటింగ్ బలహీనతలను సొమ్ము చేసుకోవాల్సి ఉంటుందని సూచించాడు.