
ఛేజింగ్కే..
ఈ మ్యాచ్ కోసం రెండు జట్లూ సమాయాత్తం అయ్యాయి. పాకిస్తాన్పై వరుసగా రెండో మ్యాచ్లోనూ ఘన విజయం సాధించడానికి టీమిండియా వ్యూహాలను రూపొందించుకుంది. టాస్ గెలిస్తే- టీమిండియా కేప్టెన్ రోహిత్ శర్మ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోవడం దాదాపు ఖాయమైంది. పిచ్, వాతావరణం ఛేజింగ్కు అనుకూలంగా ఉండటమే దీనికి కారణం. పాకిస్తాన్ టాస్ గెలిచినా ఫీల్డింగ్ తీసుకోవడానికి మొగ్గు చూపుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు.

గాయాల బెడద..
భారత్-పాకిస్తాన్ గాయాల బారిన పడ్డాయి. రవీంద్ర జడేజా మోకాలి గాయంతో టోర్నమెంట్ మొత్తానికీ దూరం అయ్యాడు. టీ20 ప్రపంచకప్ 2022లో కూడా అతను ఆడటం అనుమానమే. జడేజా మోకాలికి సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని నుంచి కోలుకోవడానికి కనీసం ఆరువారాల సమయం పట్టొచ్చు. సర్జరీ తరువాత మళ్లీ వందశాతం ఫిట్నెస్ను సాధించాల్సి ఉంటుందతనికి. ఫలితంగా టీ20 ప్రపంచకప్కు దూరం అవుతాడనే అంచనాలు ఉన్నాయి. జడేజా స్థానంలో అక్షర్ పటేల్ జట్టులోకి వచ్చాడు.

షానవాజ్ దహానీ..
పాకిస్తాన్ జట్టులో స్టార్ పేసర్ షానవాజ్ దహాని దూరం అయ్యాడు. పక్కటెముకల్లో నొప్పితో అతను బాధపడుతున్నాడు. భారత్తో మ్యాచ్ ఆడట్లేదు. అతని స్థానంలో హసన్ అలీ లేదా మహ్మద్ హొస్నయిన్ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. షహిన్షా అఫ్రిది, మహమ్మద్ వసీం జూనియర్ గాయాలపాలయ్యారు. ఇప్పుడు ఈ జాబితాలోకి దహాని చేరాడు.

అవేష్ ఖాన్ దూరం?
ఈ పరిస్థితుల్లో భారత్ మరో ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది. పేస్ బౌలర్ అవేష్ ఖాన్ జట్టుకు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడింది. అతను జ్వరంతో బాధపడుతున్నాడు. నెట్ ప్రాక్టీస్ సెషన్స్లో కూడా పాల్గొనలేదు. హోటల్ గదికే పరిమితం అయ్యాడు. అవేష్ ఖాన్ జ్వరం బారిన పడ్డ విషయాన్ని హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ నిర్ధారించారు. జ్వరం సాధారణంగానే ఉందని, ఈ మధ్యాహ్నం వరకు కోలుకోగలిగితే- అప్పటి పరిస్థితులను బట్టి తుదిజట్టులోకి తీసుకుంటామని స్పష్టం చేశారు.

ప్రభావం చూపని..
గ్రూప్ దశలో రెండు మ్యాచ్లల్లోనూ ఆడాడీ మధ్యప్రదేశ్ పేస్ బౌలర్. పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోయాడు. పాకిస్తాన్పై జరిగిన మ్యాచ్లో రెండు ఓవర్లల్లో 19 పరుగులు ఇచ్చాడు. ఫకర్ జమాన్ వికెట్ తీశాడు. రెండో మ్యాచ్లో హాంకాంగ్పై పూర్తిగా చేతులెత్తేశాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 53 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక్కడా అతను పడగొట్టింది ఒక్క వికెట్ మాత్రమే. ఓవర్కు 13 చొప్పున పరుగులను పిండుకున్నారు హాంకాంగ్ బ్యాటర్లు.

అవేష్ ఖాన్ స్థానంలో..
జ్వరం రావడంతో ఇవ్వాళ్టి మ్యాచ్కు అవేష్ ఖాన్ దాదాపుగా దూరం అయినట్టే. అతని స్థానంలో రవిచంద్రన్ అశ్విన్ను తుదిజట్టులోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అతని స్థానాన్ని పేస్ బౌలర్కు బదులుగా స్పిన్నర్ను ఆడించాలని రాహుల్ ద్రావిడ్ భావిస్తున్నారు. ఎక్స్ట్రా స్పిన్నర్ను తుదిజట్టులోకి తీసుకునే అవకాశాన్ని పరిశీలిస్తామని వ్యాఖ్యానించారు. రవిచంద్రన్ అశ్విన్ తొలి రెండు మ్యాచ్లల్లో ఆడలేదు. బెంచ్కే పరిమితం అయ్యాడు.


Click it and Unblock the Notifications












