
దుబాయ్: ఆసియా కప్ మెగా టోర్నమెంట్ రెండో మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ ఢీ కొనబోతోన్నాయి. ఈ సాయంత్రమే మ్యాచ్. దుబాయ్ స్టేడియంలో సాయంత్రం 7:30 గంటలకు ఈ హైఓల్టేజ్ మ్యాచ్ ఆరంభం కానుంది. రోహిత్ సేన- బాబర్ ఆజమ్ సారథ్యంలోని పాకిస్తాన్ టీమ్తో తలపడనుంది. దీని రిజల్ట్ ఎలా ఉండబోతోందనేది ఉత్కంఠతను రేపుతోంది. భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ఫీవర్ ప్రేక్షకులను కమ్మేసింది.
భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అనగానే.. రెండు జట్ల ప్లేయర్లు కూడా తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కోవడం సహజం. టీమ్లో ఒకరకమైన భావోద్వేగాలకు గురవుతుంటారు. దీన్ని అధిగమించడానికి, ప్లేయర్ల మధ్య సాధారణ వాతావరణం ఏర్పడటం అవసరం. మ్యాచ్కు ముందు మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి, ప్రెషర్కు గురి కాకుండా ఉండేలా చేయడంలో హెడ్ కోచ్, ఇతర సపోర్టింగ్ స్టాఫ్ కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది.
మ్యాచ్ గెలవడానికి అవసరమైన వ్యూహాలను రూపొందించడానికి, వాటిపై చర్చించడానికి హెడ్ కోచ్ అత్యవసరం. ప్రస్తుతం టీమిండియా తాత్కాలిక హెడ్ కోచ్గా వీవీఎస్ లక్ష్మణ్ పని చేస్తోన్నారు. ఫుల్ టైమ్ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కోవిడ్ బారిన పడటం వల్ల ఆయన స్థానాన్ని వీవీఎస్తో భర్తీ చేసింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్. కొంతకాలంగా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ జట్టుతో కలిసి ఉండట్లేదు. కరోనా వైరస్ బారిన పడటం వల్ల హోటల్కే పరిమితం అయ్యాడు.
ఇప్పుడా పరిస్థితి లేదు. రాహుల్ ద్రావిడ్ కోవిడ్ నుంచి కోలుకున్నాడు. జట్టుతో కలిశాడు. దుబాయ్ హోటల్లో బస చేసిన జట్టు టీమ్ మెంబర్స్ను అతను ఈ తెల్లవారు జామున కలిసినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కోవిడ్ నెగెటివ్ రిపోర్ట్ రావడంతో ద్రావిడ్ జట్టును కలిశాడని పేర్కొన్నాయి. పాకిస్తాన్తో ఇంకొన్ని గంటల్లో మ్యాచ్ ఆడటానికి ముందు చోటు చేసుకున్న ఈ పరిణామాన్ని శుభసూచకంగా భావిస్తోన్నారు. మ్యాచ్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చించడానికి ద్రావిడ్ అందుబాటులోకి రావడం ప్లస్ పాయింట్.