
ఇస్లామాబాద్: ప్రతిష్ఠాత్మక ఆసియా కప్ 2022 మెగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం కాబోతోన్న వేళ.. ఇందులో భాగంగా బలమైన భారత జట్టును ఎదుర్కొనడానికి సిద్ధపడుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో పాకిస్తాన్కు అనూహ్యంగా మరో ఎదురుదెబ్బ తగిలింది. ఒక రకంగా ఇది ఆ జట్టు విజయావకాశాలను దెబ్బ కొట్టేదే. ఆసియా కప్లో భారత్పై ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి ఎప్పుడెప్పుడా అంటూ బాబర్ ఆజమ్ టీమ్ ఎదురు చూస్తోన్న నేపథ్యంలో సంభవించిన ఈ పరిణామం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేదే.
స్టార్ బౌలర్ మహ్మద్ వసీం జూనియర్ గాయపడ్డాడు. టోర్నమెంట్ నుంచి వైదొలిగాడు. ఇప్పటికే పాకిస్తాన్ బౌలింగ్ వెన్నెముక, ఫాస్ట్ బౌలర్ షహీన్ షా అఫ్రిది గాయం వల్ల ఆసియా కప్ 2022 టోర్నమెంట్కు దూరం అయిన విషయం తెలిసిందే. ఈ టోర్నమెంట్ ఒక్కటే కాదు. దీని తరువాత ఇంగ్లాండ్లో పర్యటించాల్సి ఉన్న పాకిస్తాన్ జట్టులోనూ అఫ్రిదికి చోటు లభించకపోవచ్చు. గాయం వల్ల కనీసం ఆరు వారాల పాటు షహీన్ షా అఫ్రిది విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మళ్లీ అతను అక్టోబర్లో జట్టులోకి వస్తాడని పీసీబీ చెబుతోంది.
ఈ పరిస్థితుల్లో తాజాగా మహ్మద్ వసీం జూనియర్ కూడా గాయపడటం పాకిస్తాన్ను సంకట స్థితిలోకి నెట్టేసినట్టయింది. అతను గాయపడిన విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ అధికారికంగా ప్రకటించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో నెట్ ప్రాక్టీస్ చేస్తోన్న సమయంలో వసీం జూనియర్ గాయపడగా.. వెంటనే అతనికి ఎంఆర్ఐ స్కానింగ్ చేశారు. పక్కటెముకల్లో స్వల్పంగా గాయాలైనట్లు తేలింది. దీనితో అతనికి విశ్రాంతిని ఇచ్చినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మెడికల్ అడ్వైజరీ కమిటీ తెలిపింది.
అతని స్థానంలో హసన్ అలీని జట్టులోకి తీసుకున్నట్లు పీసీబీ పేర్కొంది. ప్రస్తుతం అతను రావల్పిండిలో నేషనల్ టీ20 టోర్నమెంట్కు సిద్ధపడుతున్నాడని, అతన్ని దుబాయ్కు పంపించినట్లు వివరించింది. డొమెస్టిక్ క్రికెట్లో నిలకడగా రాణిస్తోన్నందున హసన్ అలీని జట్టులోకి తీసుకున్నట్లు స్పష్టం చేసింది. పాకిస్తాన్ జట్టులో- బాబర్ ఆజమ్ (కేప్టెన్), షాదాబ్ ఖాన్, ఆసిఫ్ అలీ, ఫకర్ జమాన్, హైదర్ అలీ, హ్యారిస్ రవూఫ్, ఇఫ్తికర్ అహ్మద్, ఖుష్దిల్ షా, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, హసన్ అలీ, నసీమ్ షా, షానవాజ్ దహాని, ఉస్మాన్ ఖాదిర్ ఉన్నారు.