
ఉత్కంఠతలో..
దుబాయ స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్.. 19.5 ఓవర్లల్లో 147 పరుగులకు ఆలౌట్ అయింది. ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ ఒక్కడే టాప్ స్కోరర్. 42 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్తో 43 పరుగులు చేశాడతను. టాప్ ఆర్డర్లో ఇఫ్తికర్ అహ్మద్ 28 పరుగులు చేశాడు. టీమిండియా బౌలర్ల దెబ్బకు కేప్టెన్ బాబర్ ఆజమ్ సహా మిగిలిన బ్యాటర్లెవరూ భారీ స్కోర్ సాధించలేకపోయారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన భారత్.. అయిదు వికెట్లు మాత్రమే కోల్పోయి ఆ లక్ష్యాన్ని ఛేదించింది.

సిక్స్తో గెలుపు..
చివరి బంతి వరకూ కొనసాగింది మ్యాచ్. చివరి ఆరు బంతుల్లో ఏడు పరుగులు అవసరం కావడం, అదే సమయంలో రవీంద్ర జడేజా వికెట్ పడటం మరింత ఉత్కంఠభరితంగా మారింది. చివరి ఓవర్ నాలుగో బంతిని సిక్స్గా మలిచి.. భారత్కు ఘన విజయాన్ని అందించాడు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా. ఈ గెలుపుతో భారత్లో సంబరాలు మిన్నంటాయి. అభిమానుల ఆనందానికి హద్దు లేకుండా పోయింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్ సహా పలు నగరాల్లో రాత్రంతా సందడి చేశారు.

ఇదే అసలు సిసలు మజా..
ఈ విజయం పట్ల రోహిత్ శర్మ స్పందించాడు. పోస్ట్ మ్యాచ్ ప్రజంటేషన్ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడాడు. ఇలాంటి మ్యాచ్లతోనే మజా వస్తుందని వ్యాఖ్యానించాడు. ఏకపక్షంగా సాగే మ్యాచ్ల కంటే ఇలా హోరాహోరీగా సాగే వాటి ద్వారా వచ్చే విజయాన్ని తాను ఎక్కువగా ఆస్వాదిస్తానని పేర్కొన్నాడు. మ్యాచ్ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ.. తామే గెలిచి తీరుతామనే ఆత్మవిశ్వాసంతో చివరి వరకూ ఉన్నామని, అదే నిజమైందని అన్నాడు.

వన్ సైడెడ్ కంటే..
గెలుస్తామనే నమ్మకం ఎప్పుడైతే ఉంటుందో.. అలాంటప్పుడు ఇలాంటి విజయాలే అందుతాయని చెప్పాడు. పాకిస్తాన్పై అందుకున్న ఈ విజయం తరువాత.. జట్టులో తమ రోల్ ఏమిటనేది ప్రతి ప్లేయర్కు కూడా ఈ పాటికి బాగా అర్థమైపోయుంటుందని అన్నాడు. ఇందులో గెలవడం అనేది సవాళ్లతో కూడుకుని ఉండేదని, వన్ సైడెడ్ కంటే ఇలా ఛాలెంజ్లను విసిరే మ్యాచ్ల ద్వారా లభించే విజయాన్ని ఆస్వాదించడంలో ఉండే మజా వేరని చెప్పాడు.

పాండ్యా స్పెషాలిటీస్..
బౌలర్లపై రోహిత్ శర్మ ప్రశంసల వర్షాన్ని కురిపించాడు. పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్.. భిన్న పరిస్థితులు, విభిన్న వాతావరణం, అంతకంటే భిన్నమైన పిచ్లపై అపార క్రికెట్ను ఆడిన అనుభవాన్ని సొంతం చేసుకుందని, అది ఇక్కడ ఉపయోగపడిందని అన్నాడు. ప్రత్యేకించి హార్దిక్ పాండ్యాను ఆకాశానికెత్తేశాడు. బంతితో, బ్యాట్తో తానెంత విలువైన ప్లేయర్ అనేది హార్దిక్ పాండ్యా మరోసారి నిరూపించుకున్నాడని చెప్పాడు.

ఫిట్నెస్ సూపర్..
జట్టులో పునరాగమనం తరువాత హార్దిక్ పాండ్యా అత్యుత్తమంగా రాటుదేలాడని రోహిత్ శర్మ కితాబిచ్చాడు. 140 కిలోమీటర్లకు పైగా బంతులను అవలీలగా సంధించేంతటి ఫిట్నెస్ను సాధించాడని చెప్పాడు. బ్యాటింగ్ క్వాలిటీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదని, అతని ఎలా ఆడుతున్నాడనేది అందరూ చూస్తోన్నారని వ్యాఖ్యానించాడు. తీవ్ర ఒత్తిడిలో ఎలా గెలవాలనే విషయంపై ఈ మ్యాచ్ ఓ పాఠంలా ఉపయోగపడుతుందని చెప్పాడు.


Click it and Unblock the Notifications
