

హైదరాబాద్: ఆసియా కప్ టోర్నీలో చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్ను చిత్తుగా ఓడించింది భారత జట్టు. మంగళవారం దుబాయి ఇంటర్నేషన్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో పాక్పై టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత బౌలర్లు చెలరేగడంతో పాకిస్థాన్ 162 పరుగులకే కుప్పకూలింది.
పాకిస్థాన్ నిర్దేశించిన 163 పరుగుల విజయ లక్ష్యాన్ని టీమిండియా 29 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసి లక్ష్యాన్ని చేధించింది. ఈ మ్యాచ్కు ముందు కీలక పోరులో భారత్ నెగ్గుతుందా? లేదా అన్న సందేహాం భారత అభిమానుల్లో నెలకొంది. అయితే, మంగళవారం నాటి మ్యాచ్లో భారత జట్టు ప్రదర్శన చూసి ఫిదా అయ్యారు.
భారత జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ (52) హాఫ్ సెంచరీతో రాణించగా, మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (46) పరుగులతో తృటిలో హాఫ్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు(31 నాటౌట్), దినేశ్ కార్తీక్ (31 నాటౌట్) పరుగులతో భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.
పాక్ బౌలర్లలో ఫహీమ్ అష్రఫ్, షాదబ్ ఖాన్ చెరో వికెట్ తీసుకున్నారు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు భారత బౌలర్లలో భువనేశ్వర్ (3/15), కేదార్ జాదవ్ (3/23), బుమ్రా (2/23) విజృంభించడంతో 43.1 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది.
తాజా విజయంతో టోర్నీ సూపర్-4లోకి ప్రవేశించిన భారత్ జట్టు తర్వాత మ్యాచ్ శుక్రవారం బంగ్లాదేశ్తో ఆడనుంది. టీమిండియా విజయంపై ట్విటర్ వేదికగా భారత ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపించారు.