

హైదరాబాద్: గతేడాది ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఓటమికి యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్ టోర్నీలో పాకిస్థాన్పై భారత జట్టు బదులు తీర్చుకుంది. మంగళవారం దుబాయి ఇంటర్నేషన్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో పాక్పై టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
తాజా విజయంతో టోర్నీ సూపర్-4లోకి ప్రవేశించిన భారత్ జట్టు తర్వాత మ్యాచ్ శుక్రవారం బంగ్లాదేశ్తో ఆడనుంది. పాకిస్థాన్ నిర్దేశించిన 163 పరుగుల విజయ లక్ష్యాన్ని టీమిండియా 29 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసి లక్ష్యాన్ని చేధించింది. భారత జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ (52) హాఫ్ సెంచరీతో రాణించగా, మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (46) పరుగులతో తృటిలో హాఫ్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు.
అనంతరం క్రీజులోకి వచ్చిన అంబటి రాయుడు(31 నాటౌట్), దినేశ్ కార్తీక్ (31 నాటౌట్) పరుగులతో భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. పాక్ బౌలర్లలో ఫహీమ్ అష్రఫ్, షాదబ్ ఖాన్ చెరో వికెట్ తీసుకున్నారు. అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు భారత బౌలర్లలో భువనేశ్వర్ (3/15), కేదార్ జాదవ్ (3/23), బుమ్రా (2/23) విజృంభించడంతో 43.1 ఓవర్లలో 162 పరుగులకే ఆలౌటైంది.
రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ
లక్ష్యం తక్కువగా ఉండటంతో భారత్ ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ మంచి ఆరంభాన్ని అందించారు. కెప్టెన్ రోహిత్ శర్మ.. పాక్ ఫాస్ట్ బౌలర్లని లక్ష్యంగా చేసుకుని ఎడాపెడా బౌండరీలు బాదేశాడు. ఉస్మాన్ ఖాన్ వేసిన ఓవర్లోనే రెండు సిక్సర్లు, ఒక ఫోర్ బాదాడు. దీంతో దూకుడుగా ఆడిన రోహిత్ శర్మ చూస్తుండగానే 36 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులతో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
అయితే... జట్టు స్కోరు 86 వద్ద అతను ఔటవగా.. హాఫ్ సెంచరీకి చేరువైన ధావన్ కూడా 104 వద్ద పెవిలియన్కి చేరిపోయాడు. అప్పటికే మ్యాచ్ పూర్తిగా భారత్ చేతుల్లోకి వచ్చేయడంతో.. ఆఖర్లో గెలుపు లాంఛనాన్ని అంబటి రాయుడు (31 నాటౌట్: 46 బంతుల్లో 3 ఫోర్లు), దినేశ్ కార్తీక్ (31 నాటౌట్: 37 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్సు)తో పూర్తి చేశారు.
టీమిండియా విజయలక్ష్యం 163
దుబాయి వేదికగా పాకిస్థాన్తో జరుగుతున్న మ్యాచ్లో భారత బౌలర్లు సత్తా చాటారు. ఆసియాకప్ తొలి వన్డేలో హాంకాంగ్పై తడబడిన మన బౌలర్లు.. పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో చెలరేగారు. పాకిస్థాన్ను 43.1 ఓవర్లలో 162 పరుగులకే ఆలాట్ చేశారు. దీంతో భారత్కు పాకిస్థాన్ 163 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ జట్టులో బాబర్ అజాం (47), షోయబ్ మాలిక్ (43) మాత్రమే రాణించారు. ఈ మ్యాచ్ ఆరంభంలో ఓపెనర్ల వికెట్లు తీసిన భువనేశ్వర్ పాక్కు షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత బాబర్ ఆజాం, షోయబ్ మాలిక్లు నిలకడగా ఆడారు. ఆ తర్వాత వీరిద్దరి భాగస్వామ్యానికి భారత బౌలర్లు విడదీశారు.

దీంతో భారీ స్కోర్ సాధిస్తుందని ఆశించిన పాకిస్థాన్ తక్కువ స్కోర్కే ఆలౌటైంది. ఈ మ్యాచ్లో ఇన్నింగ్స్ ఇన్నింగ్స్ 18వ ఓవర్ వేస్తున్న హార్దిక్ పాండ్యా అదే ఓవర్ ఐదో బంతిని బౌల్ వేసిన అనంతరం కిందపడ్డాడు. బంతిని వేసిన తర్వాత కుడి కాలును నేలపై సరిగా వేయడంలో పాండ్యా ఇబ్బందిపడ్డాడు. బాధతో విలవిలలాడిపోయాడు.
దీంతో తన నడుముని పట్టుకొని పిచ్పై పడుకున్నాడు. అదే సమయంలో జట్టులోని సహచర క్రికెటర్లు అతని వద్దకు పరిస్థితి ఎలా ఉందోనని పరీశించారు. అప్పటికే జట్టు ఫిజియో మైదానంలోకి చేరుకొని అతని గాయాన్ని పరిశీలించారు. గాయం తీవ్రంగా ఎక్కువగా ఉండటంతో స్ట్రెచర్ తీసుకువచ్చి వెంటనే అతన్ని మైదానం నుంచి తీసుకెళ్లారు.
అతని స్థానంలో వచ్చిన మనీష్ పాండే ఓ సూపర్ క్యాచ్తో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్లో భారత బౌలర్లు భువనేశ్వర్, కేదార్ జాదవ్లు చెరో మూడేసి వికెట్లు తీసుకోగా... బుమ్రా రెండు వికెట్లు తీసుకోగా, కుల్దీప్ ఓ వికెట్ తీశారు.
ఆసియా కప్లో రఫాడిస్తున్న భారత బౌలర్లు
ఆసియాకప్లో భాగంగా పాక్తో జరుగుతున్న మ్యాచ్లో భారత్ బౌలర్లు రఫాడిస్తున్నారు. ఆరంభంలో భువనేశ్వర్ కుమార్ రెండు వికెట్లు తీశాడు. ఆ తర్వాత బాబర్, షోయెబ్ మాలిక్లు హాఫ్ సెంచరీపైగా భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే నిలకడగా కొనసాగుతున్న పాక్ ఆటగాళ్లను వెంటవెంటనే పెవిలియన్కు చేర్చారు.
22వ ఓవర్లో కుల్దీప్ బౌలింగ్లో బాబర్ ఆజాం ఔటయ్యాడు. అనంతరం గాయపడ్డ పాండ్యా స్థానంలో ఫీల్డింగ్కు వచ్చిన మనీష్ పాండే ఓ స్టన్నింగ్ క్యాచ్ పట్టాడు. కేదార్ జాదవ్ వేసిన ఇన్నింగ్స్ 25వ ఓవర్లో సర్ఫరాజ్ అహ్మద్ భారీ షాట్కు ప్రయత్నించారు. వైడ్ లాంగ్ ఆఫ్ నుంచి పరుగెత్తుకుంటూ వచ్చిన పాండే.. బౌండరీ వద్ద కళ్లు చెమిరే క్యాచ్ అందుకున్నాడు.
బంతి దాదాపు బౌండరీ మీదుగా వెళ్తున్న సమయంలో మనీష్ పాండే దానిని క్యాచ్గా అందుకున్నాడు. కానీ బౌండరీ రోప్ దాటకుండా బంతిని పైకి విసిరి మళ్లీ బౌండరీ లైన్ లోపే దాన్ని పట్టుకున్నాడు. అత్యంత కష్టమైన క్యాచ్ పాండే పట్టిన తీరు ప్రేక్షకుల్ని అలరించింది. ఆ తర్వాత ఇన్నింగ్స్ 27వ ఓవర్లో రాయుడు అద్భుత ఫీల్డింగ్ చేశాడు. డైరక్ట్ త్రో వేయడంతో.. షోయెబ్ మాలిక్ రనౌటయ్యాడు.
దీంతో పాక్ వరుస ఓవర్లలో రెండు కీలక వికెట్లను చేజార్చుకుంది.
హాఫ్ సెంచరీకి ముందు బాబర్ ఔట్
ఆసియాకప్లో భాగంగా భారత్తో జరుగుతున్న మ్యాచ్లో పాకిస్థాన్ మూడో వికెట్ చేజార్చుకుంది. హాఫ్ సెంచరీకి చేరువైన బాబర్ ఆజామ్ (47) ఔటయ్యాడు. కుల్దీప్ యాదవ్ వేసిన 21.2వ బంతికి అతడు ముందుకొచ్చి ఆడబోయి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మూడు పరుగులకే రెండు వికెట్లు చేజార్చుకున్న పాక్ను బాబర్ ఆదుకున్నాడు. షోయబ్ మాలిక్తో కలిసి మూడో వికెట్కు 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ప్రస్తుతం 23 ఓవర్లు ముగిసే సరికి పాక్ 87/3తో నిలిచింది. షోయబ్ మాలిక్ (35) నిలకడగా ఆడుతున్నాడు. సర్ఫరాజ్ అహ్మద్ (2) పరుగులతో ఉన్నాడు.
డ్రింక్స్ విరామానికి పాకిస్థాన్ 60/2
ఆసియాకప్లో భాగంగా భారత్తో జరుగుతున్న మ్యాచ్లో పాకిస్థాన్ నిలకడగా ఆడుతోంది. డ్రింక్స్ విరామానికి గాను అంటే 16 ఓవర్లు ముగిసే సమయానికి పాకిస్థాన్ 2 వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మ్యాచ్ ఆరంభంలో రెండు వికెట్లు తీసి భువనేశ్వర్ కుమార్ పాక్కి షాకిచ్చాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన వెటరన్ క్రికెటర్ షోయబ్ మాలిక్(26) నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డుని పరిగెత్తిస్తున్నాడు. అతడికి బాబర్ అజాం(35) మద్దతు పలుకుతున్నాడు. ప్రస్తుతం 17 ఓవర్లకు గాను పాక్ 2 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. క్రీజులో బాబర్ అజాం(35), షోయబ్ మాలిక్(30) పరుగులతో ఉన్నారు.
10 ఓవర్లకు పాకిస్థాన్ 25/2
ఆసియాకప్లో భాగంగా భారత్తో జరుగుతున్న మ్యాచ్లో పాకిస్థాన్ 10 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 25 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో బాబర్ అజాం(13), షోయబ్ మాలిక్(10) పరుగులతో ఉన్నారు. ఈ మ్యాచ్లో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే పాకిస్థాన్కు ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్థాన్ కోల్పోయిన రెండు వికెట్లు భువనేశ్వర్కు దక్కాయి.
3 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన పాక్
ఆసియాకప్లో భాగంగా యూఏఈ వేదికగా భారత్తో జరుగుతున్న మ్యాచ్లో పాకిస్థాన్ రెండో వికెట్ కోల్పోయింది. ఈ మ్యాచ్లో పాకిస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే పాకిస్థాన్కు ఆరంభంలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. భువనేశ్వర్ కుమార్ వేసిన ఐదో ఓవర్ తొలి బంతికి ఫకార్ జమాన్... యజువేంద్ర చాహాల్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. దీంతో పాకిస్థాన్ ఐదు ఓవర్లు ముగిసేసరికి రెండు వికెట్లు కోల్పోయి 4 పరుగులు చేసింది. క్రీజ్లో షోయబ్ మాలిక్(1), బాబర్ ఆజాం(1) పరుగులతో ఉన్నారు.
2 పరుగులకే తొలి వికెట్ కోల్పోయిన పాక్
యూఏఈ వేదికగా భారత్తో జరుగుతున్న మ్యాచ్లో పాకిస్థాన్ తొలి వికెట్ కోల్పోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన పాకిస్థాన్కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ 3వ ఓవర్ తొలి బంతికి పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్-హక్ (2) భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో వికెట్ కీపర్ ధోనికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్కు చేరాడు. ప్రస్తుతం 3 ఓవర్లకు పాకిస్థాన్ వికెట్ నష్టానికి 3 పరుగులు చేసింది. క్రీజులో బాబర్ అజాం(1), ఫకార్ జమాన్ పరుగులేమీ చేయకుండా క్రీజులో ఉన్నాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్
ఆసియా కప్ టోర్నీలో హై ఓల్టేజ్ మ్యాచ్ ప్రారంభమైంది. దుబాయి ఇంటర్నేషనల్ స్టేడియం ఇందుకు వేదికైంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగుతున్నది. తొలి మ్యాచ్ ఆడిన శార్దూల్ ఠాకూర్, ఖలీల్ అహ్మద్ స్థానాల్లో జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యాలను టీమ్లోకి వచ్చారు.
మొదట బ్యాటింగ్ చేసి భారీ స్కోరుతో ఇండియాపై ఒత్తిడి తెస్తామని పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ చెప్పాడు. అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ టాస్ గెలిచి ఉంటే తాము కూడా బ్యాటింగ్ తీసుకునేవాళ్లమని రోహిత్ శర్మ చెప్పాడు. పిచ్ కాస్త స్లోగా ఉండటంతో బ్యాటింగ్కు అనుకూలించే అవకాశం ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ తర్వాత ఇండియా, పాకిస్థాన్ తలపడటం ఇదే తొలిసారి.
కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతినివ్వడంతో టోర్నీలో భారత్ జట్టు కొంచెం బలహీనంగా కనిపిస్తున్నా హాంకాంగ్తో జరిగిన తొలి మ్యాచ్లో ధావన్, రాయుడు మెరుపు ఇన్నింగ్స్లతో ఫామ్లోకి రావడం ఊరటనిచ్చే అంశం. ఆసియా కప్లో ఇప్పటివరకు ఈ రెండు జట్లు 12 సార్లు తలపడగా... ఆరు మ్యాచ్ల్లో భారత్ విజయం సాధించిగా, పాకిస్థాన్ ఐదు మ్యాచ్ల్లో నెగ్గింది.
ఒక మ్యాచ్ రద్దు అయింది. యూఏఈలో పాక్తో ఆడిన 26 మ్యాచ్ల్లో భారత్ గెలిచింది ఏడుసార్లు మాత్రమే. యూఏఈలో జరిగిన మ్యాచ్ల్లో మాత్రం పాకిస్థాన్దే పైచేయిగా నిలిచింది. యూఏఈ వేదికలో జరిగిన మ్యాచ్ల్లో పాకిస్థాన్ 19 సార్లు విజయం సాధించింది.
టోర్నీలో భాగంగా గ్రూప్-ఏలో ఉన్న భారత్, పాకిస్థాన్ జట్లు ఇప్పటికే చెరో మ్యాచ్ నెగ్గాయి. తొలి గ్రూప్ మ్యాచ్లో భారత్, పాక్ జట్లు హాంకాంగ్పై విజయం సాధించాయి. ఈ మ్యాచ్లో ఇరు జట్లకు ఇది రెండో మ్యాచ్. దీంతో ఈ మ్యాచ్లో విజయం సాధించి గ్రూప్-ఏలో టాపర్గా నిలవాలని ఇరు జట్లు ఊవిళ్లూరుతున్నాయి.
జట్ల వివరాలు:
టీమిండియా:
రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, అంబటి రాయుడు, ధోని, కేదార్ జాదవ్, దినేష్ కార్తీక్, హర్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, చాహల్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బమ్రా, ఖలీల్ అహ్మద్.
పాకిస్థాన్:
ఫకార్ జమాన్, ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజామ్, షోయబ్ మాలిక్, సర్ఫ్రాజ్ అహ్మద్ , ఆసిఫ్ అలీ, షాదాబ్ ఖాన్, ఫహిమ్ అష్రఫ్, హసన్ ఆలీ, మహమ్మద్ అమిర్, ఉస్మాన్ ఖాన్.