
దశాబ్ద కాలం తర్వాత కోహ్లీ-ద్రవిడ్
విరాట్ కోహ్లీ... టీమిండియా కెప్టెన్. 2011లో నాడు ద్రావిడ్ చివరి వన్డే మ్యాచ్లో ఇద్దరూ కలిసి బ్యాటింగ్ చేశారు. ద్రావిడ్ 69 పరుగులకు ఔటవగా.. విరాట్ కోహ్లీ ఆ మ్యాచ్లో సెంచరీ చేశాడు. ఇక రాహుల్ ద్రావిడ్ చివరి టెస్టు మ్యాచ్ 2021 జనవరి 24వ తేదీన ఆస్ట్రేలియాపై ఆడాడు. అప్పటికే తన 16 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ద్రవిడ్ 164 టెస్టులు ఆడాడు. కొన్ని మరుపురాని ఇన్నింగ్స్ ఆడి ప్రేక్షకుల మనసుల్లో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్నాడు.
ఇక అదే మ్యాచ్లో కోహ్లీ తన తొలి టెస్టు సెంచరీని నమోదు చేశాడు. ఫీల్డ్పై అప్పుడు కలిసిన వీరిద్దరూ మళ్లీ దశాబ్దకాలం తర్వాత ఒకే చోట కనిపించనున్నారు. అయితే ఈ సారి కోచ్గా రాహుల్ ద్రవిడ్.. కెప్టెన్గా విరాట్ కోహ్లీ. రాహుల్ ద్రవిడ్ ఐసుగడ్డలా చల్లగా ఉంటే.. కోహ్లీ మాత్రం భగభగ మండే నిప్పు కణంలా ఉంటాడు. ఇద్దరి మధ్య ఇదే ప్రధాన తేడా అని చెప్పొచ్చు.

కోచ్గా ద్రవిడ్ - కెప్టెన్గా విరాట్
ఇక ఈ దశాబ్దకాలంలో రాహుల్ ద్రవిడ్ దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ టాలెంట్ను బయటకు తీసుకొచ్చే పనిలో నిమగ్నం కాగా, ఆటగాడిగా విరాట్ కోహ్లీ తన పని తాను చేసుకుపోయాడు. ఎన్నో రికార్డులు, మరెన్నో సెంచరీలు చేస్తూ, బౌలర్లకు చుక్కలు చూపిస్తూ తనదైనశైలిలో బ్యాట్తో రెచ్చిపోయాడు. దీంతో క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. క్రికెట్పై అంత పట్టు సాధించాడు.
ఇక దశాబ్ద కాలం తర్వాత రాహుల్ ద్రవిడ్.. విరాట్ కోహ్లీలు మళ్లీ ఒకే డ్రెస్సింగ్ రూంలో కనిపించారు. ఈ సారి కోచ్గా రాహుల్ ద్రవిడ్, కెప్టెన్గా విరాట్ కోహ్లీ. న్యూజిలాండ్తో జరిగే రెండవ టెస్టుపై ఇద్దరూ తమ స్ట్రాటజీకి పదునుపెట్టారు. కివీస్తో జరిగిన తొలి టెస్టు గమనిస్తే రెండు దేశాల మధ్య టెస్టు సిరీస్ రసవత్తరంగా సాగుతుందని అర్థమవుతోంది. తొలి టెస్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ లేకపోవడంతో జట్టుపై ప్రభావం కనిపించింది. ఇక విరాట్ తిరిగి జట్టులో చేరడంతో టీమ్ రెట్టించిన ఉత్సాహంతో బరిలో దిగనుంది.

పదేళ్లలో రెండు టెస్టు మ్యాచ్ల్లో ఓటమి...
భారత టెస్టు జట్టు అత్యంత బలంగా కనిపిస్తోంది. ఇక ఎంఎస్ ధోనీ తర్వాత నాయకత్వ బాధ్యతలు చేపట్టిన విరాట్ కోహ్లీ మరింత దూకుడును ప్రదర్శిస్తున్నాడు. విరాట్ కోహ్లీ నేతృత్వంలో భారత జట్టు చాలా బలంగా ఉంటుందని ఇక సొంతగడ్డపై మ్యాచ్ను డ్రా చేసుకోగలిగితే అదే చాలని ప్రత్యర్థి జట్లు భావిస్తుంటాయి. భారత్లో భారత్పై గెలవడం ఒక కల నిజం చేసుకోవడంలాంటిదని భావిస్తుంటారు.
ఇక గత పదేళ్లలో భారత్ సొంతగడ్డపై రెండు టెస్టులు మాత్రమే ఓటమి పాలైంది. 2017లో ఆస్ట్రేలియాపై 2021లో ఇంగ్లాండ్ పై. అయితే సిరీస్ను మాత్రం కోల్పోలేదు. గతవారం కాన్పూర్లో జరిగిన మ్యాచ్లో భారత్ ఓటమి తథ్యం అనుకుంటున్న సమయంలో టీమిండియా తిరిగి పుంజుకుని కివీస్ను నిలువరించగలిగింది. ముగ్గురు స్పిన్నర్లు మ్యాచ్ను తిప్పేశారు.

కోహ్లీ కోసం ఎవరు బలవుతారు..
విరాట్ కోహ్లీ లేక పోవడంతో అజింక్యా రహానే తొలిటెస్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. ఇప్పటి వరకు అజింక్యా నేతృత్వంలో భారత్ ఓటమి చూడలేదు. కానీ కివీస్తో జరిగిన మ్యాచ్లో కొన్ని నిర్ణయాలు సరైన సమయంలో తీసుకోకపోవడంతో భారత్ విజయం సొంతం చేసుకోలేకపోయింది. డ్రాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక కెప్టెన్గా విరాట్ జట్టులో చేరడంతో కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సి ఉంది. మిడిల్ ఆర్డర్లో ఎవరిని తీసుకోవాలి అనేదానిపై దృష్టి సారించాలి.
ఇక ఆడిన తొలి టెస్టులోనే ఒక సెంచరీ, ఒక అర్థ సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ ఆకట్టుకున్నాడు. అయితే కెప్టెన్ కోసం శ్రేయాస్ త్యాగం చేస్తాడా..లేక ఫామ్ కోల్పోయిన సీనియర్ ఆటగాడిని పక్కన కూర్చోబెడతారా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇతర సపోర్టింగ్ స్టాఫ్ మాత్రం అజింక్యా రహానే, ఛటేశ్వర్ పుజారాలకు అండగా నిలుస్తున్నారు. అయితే విరాట్ కోహ్లీ కెప్టెన్గా ఉన్న సమయంలో మాత్రం పలు సందర్భాల్లో వీరిద్దరూ పెవీలియన్కే పరిమితం కావాల్సి వచ్చింది. ఇప్పుడు కోచ్ మాట నెగ్గుతుందా... లేక కెప్టెన్ కోహ్లీ మాట నెగ్గుతుందా అనేది ఇంట్రెస్టింగ్గా మారింది.
ఇక బౌలింగ్ విభాగంలో ఇషాంత్ శర్మ బదులు సిరాజ్ను తీసుకోవాలనే యోచనలో కోహ్లీ ఉన్నట్లు సమాచారం. మొత్తానికి చాలా కాలం తర్వాత మిస్టర్ కూల్ రాహుల్ ద్రవిడ్, మ్యాన్ ఆన్ ఫైర్ విరాట్ కోహ్లీలు కలిసి కనిపిస్తుండటంతో సర్వత్రా ఆసక్తిగా మారింది. ఇద్దరు సవాళ్ల నుంచి వెనుదిరిగే వ్యక్తులు కాదు. ఇద్దరూ సమయానికి తగ్గ స్ట్రాటజీని అమలు చేస్తూ కెరీర్లో దూసుకొచ్చారు. అయితే కివీస్తో జరిగే రెండో టెస్టులో కోచ్గా రాహుల్, కెప్టెన్గా కోహ్లీ ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తారో తెలియాలంటే డిసెంబర్ 3వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications












