
ఇప్పుడైనా తీరేనా?:
ఐసీసీ ప్రవేశపెట్టిన అన్ని టోర్నీలను టీమిండియా కైవసం చేసుకుంది. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ టైటిళ్లను భారత్ సొంతంచేసుకుంది. ఈ ట్రోఫీలు అన్ని మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కెప్టెన్గా ఉన్నప్పుడే భారత్ సాధించింది. దీంతో ప్రపంచ క్రికెట్లో మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక సారథిగా ధోనీ నిలిచాడు. ధోనీని గురువుగా భావించే విరాట్ కోహ్లీ మాత్రం ఇప్పటివరకు ఒక్క ఐసీసీ ట్రోఫీ గెలవలేదు. కోహ్లీ సారథ్యంలో భారత్ ఈ ఐదేళ్ల కాలంలో ఓసారి టీ20 ప్రపంచకప్ ఫైనల్కు చేరుకుని ఓడిపోయింది. 2019 వన్డే ప్రపంచకప్లో సెమీస్ నుంచి ఇంటికి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ రూపంలో ఐసీసీ ట్రోఫీ అందుకునే సువర్ణావకాశం కోహ్లీ ముందుంది. ఇన్నాళ్ల తన కలను నెరవేర్చుకునేందుకు ఇదే మంచి అవకాశమని అందరూ అంటున్నారు. ఇప్పుడు మిస్ అయిందో.. మళ్లీ ఇంతమంచి అవకాశం కోహ్లీకి వస్తుందో లేదో చెప్పలేం.

న్యూజిలాండ్ పరిస్థితి అంతే:
మరోవైపు న్యూజిలాండ్ జట్టు కూడా ఇప్పటివరకు ఒక్క ఐసీసీ ట్రోఫీ గెలవలేదు. 2015, 2019 వన్డే ప్రపంచకప్లలో ఆ అవకాశం వచ్చినా.. కివీస్ అందుకోలేకపోయింది. రెండు ప్రపంచకప్లలో వరుస విజయాలతో దుమ్మురేపిన కివీస్.. ఫైనల్లో మాత్రం చేతులెత్తేసింది. ముఖ్యంగా 2019 వన్డే ప్రపంచకప్ చేతులోకి వచ్చినట్టే వచ్చి చేజారింది. దీంతో మర్యాదకు మారుపేరైన కివీస్ ఈ ఛాంపియన్షిప్ గెలవాలని పట్టుదలతో ఉంది. విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్ ఇద్దరికీ ఈ ట్రోఫీ చాలా కీలకం. మరి డబ్ల్యూటీసీ ఫైనల్లో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.

20 నెలలుగా సెంచరీ లేదు:
రికార్డుల రారాజు, చేజింగ్ కింగ్ విరాట్ కోహ్లీ ఏడాదికి కనీసం నాలుగైదు సెంచరీలు అలవోకగా బాదేస్తుంటాడు. అలాంటిది దాదాపు 20 నెలలుగా కనీసం ఒక్క ఫార్మాట్లోనూ సెంచరీ చేయలేకపోయాడు. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్లో అయినా శతకం చేయాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కోహ్లీ 2019 నవంబర్లో బంగ్లాదేశ్తో జరిగిన డే/నైట్ టెస్టులో సెంచరీ చేశాడు. ఆ తర్వాత ఇప్పటివరకు ఎన్ని ఇన్నింగ్స్లు ఆడినా.. సెంచరీ మాత్రం చేయలేకపోయాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో పలుమార్లు సెంచరీకి చేరువైనా దురదృష్టవశాత్తూ మూడంకెల స్కోర్ అందుకోలేకపోయాడు.

చెత్త రికార్డు:
ఫైనల్ ముందు ఓ చెత్త రికార్డు టీమిండియాను కలవర పెడుతుంది. 2003 వన్డే ప్రపంచకప్ తర్వాత ఐసీసీ ఈవెంట్లలో న్యూజిలాండ్తో జరిగిన ఒక్క మ్యాచ్లో కూడా భారత్ గెలవలేదు. 18 ఏళ్ల కాలంలో ఐసీసీ మెగా ఈవెంట్స్లో ఆరుసార్లు తలపడిన భారత్.. ఐదింటిలో ఓటమిపాలైంది. ఒక మ్యాచ్ వర్షంతో జరగలేదు. 2003 వన్డే ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో న్యూజిలాండ్తో తలపడిన భారత జట్టు విజయం సాధించి సెమీఫైనల్కు చేరింది. 2007 వన్డే ప్రపంచకప్లో భారత్ లీగ్ దశలోనే ఇంటిదారి పట్టడంతో కివీస్తో ఆడే అవకాశం రాలేదు. ఎంఎస్ ధోనీ సారథ్యంలోని 2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టు కూడా కివీస్ చేతిలో ఓటమిపాలైంది. 2009 చాంపియన్స్ ట్రోఫీ, 2011 ప్రపంచకప్, 2012 టీ20 ప్రపంచకప్, 2013 చాంపియన్స్ ట్రోఫీ, 2014 టీ20 ప్రపంచకప్, 2015 వన్డే ప్రపంచకప్లో న్యూజిలాండ్తో భారత్ తలపడలేదు. 2016 టీ20 ప్రపంచకప్లోనూ చిత్తయింది. 2017 చాంపియన్స్ ట్రోఫీలో ఇరు జట్లు తలపడలేదు. ఇక 2019 వన్డే ప్రపంచకప్లో ఇరు జట్లు రెండు సార్లు తలపడ్డాయి. తొలి మ్యాచ్ వర్షంతో తుడిచిపెట్టుకుపోగా.. కీలకమైన సెమీస్లో భారత్ 18 పరుగులతో ఓటమిపాలైంది


Click it and Unblock the Notifications
