చివరి 6 బంతుల్లో 16 పరుగులు
టీమిండియాకు లక్ష్య ఛేదనలో చివరి 6 బంతుల్లో 16 పరుగులు అవసరంకాగా.. క్రీజులో ఉన్న మిథాలీ రాజ్ (24 నాటౌట్: 20 బంతుల్లో 3 ఫోర్లు), దీప్తి శర్మ (21 నాటౌట్: 16 బంతుల్లో ఫోర్, సిక్స్) చెరొక ఫోర్ సాధించడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. అయితే, ఆఖరి బంతికి 4 పరుగులు అవసరమైన దశలో క్రీజులో ఉన్న మిథాలీరాజ్ కేవలం ఒక్క పరుగే సాధించడంతో టీమిండియా 2 పరుగుల తేడాతో ఓడిపోయింది.
162 పరుగుల లక్ష్యంతో బరిలోకి
దీంతో న్యూజిలాండ్ గడ్డపై భారత మహిళల క్రికెట్ జట్టు పర్యటన ముగిసింది. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు ఓపెనర్ స్మృతి మంధాన శుభారంభమిచ్చింది. ఓపెనర్ ప్రియా పునియా (1) నిరాశపరిచినా.. దూకుడుగా ఆడిన స్మృతి మంధాన (86: 62 బంతుల్లో 12 ఫోర్లు, సిక్స్) హాఫ్ సెంచరీతో రాణించి భారత్ జట్టుని మెరుగైన స్థితిలో నిలిపింది.
మరోసారి పేలవ ప్రదర్శన
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జెమీమా (21: 17 బంతుల్లో 3 ఫోర్లు) జట్టు స్కోరు 76 వద్ద ఔటవగా.. అనంతరం వచ్చిన కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (2) ఈ సిరీస్లో మరోసారి పేలవ ప్రదర్శన చేసింది. దీంతో బంతులు, పరుగుల మధ్య అంతరం పెరగడంతో దూకుడుగా ఆడే క్రమంలో జట్టు స్కోరు 123 వద్ద స్మృతి మంధాన ఔట్ కావడంతో టీమిండియా 159/4కే పరిమితమైంది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్
అంతకముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 161 పరుగులు చేసింది. ఓపెనర్ డెవిన్ (72: 52 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సులు) హాఫ్ సెంచరీ సాధించగా.. కెప్టెన్ ఆమీ (31: 23 బంతుల్లో 3 ఫోర్లు) చక్కటి ఇన్నింగ్స్ ఆడింది. భారత్ బౌలర్లలో దీప్తి శర్మ రెండు వికెట్లు, మాన్షీ జోషి, రాధ యాదవ్, అరుంధతి, పూనమ్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.