హైదరాబాద్: మూడు వన్డేల సిరిస్లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే ఆదివారం ముంబైలోని వాంఖడె స్టేడియంలో జరగనుంది. ఈ నేపథ్యంలో ముంబైలోని వాంఖడే మైదానంలో శుక్రవారం భారత జట్టు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంది. ఇరు జట్లు నెట్స్లో తీవ్రంగా చెమటోడ్చాయి.
ప్రాక్టీస్ అనంతరం రోహిత్ మీడియాతో మాట్లాడాడు. ఆస్ట్రేలియాపై కనబర్చిన ప్రదర్శనే న్యూజిలాండ్పై కూడా చేసి సిరిస్ దక్కించుకోవాలని చూస్తున్నామని అన్నాడు. న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ను ఎదుర్కొవడం భారత బ్యాట్స్మెన్కు సవాల్తో కూడుకున్నదని ఈ సందర్భంగా రోహిత్ పేర్కొన్నాడు.

ఇక, రహనే ఏ స్థానంలో బరిలోకి దిగుతాడనే దానిపై పూర్తి నిర్ణయం కెప్టెన్, కోచ్దే అని రోహిత్ శర్మ చెప్పాడు. 'ఆసీస్తో జరిగిన వన్డే సిరీస్లో శిఖర్ ధావన్ అందుబాటులో లేకపోవడంతో రహానే ఓపెనర్గా బరిలోకి దిగాడు. ఇప్పుడు ధావన్ తిరిగి జట్టులో చేరాడు. కాబట్టి రహానె ఓపెనర్గా వచ్చే అవకాశం లేదు' అని రోహిత్ అభిప్రాయపడ్డాడు.
'ఏ స్థానంలో బ్యాటింగ్కు దిగుతాడు అన్న దానిపై తుది నిర్ణయం కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రిదే. దీనిపై నాకు ఎలాంటి అవగాహన లేదు. నాలుగో స్థానంలో బరిలోకి దింపాలని కోహ్లీ భావిస్తే అదే జరగొచ్చు. రహానేకు ఆ స్థానంలో ఆడిన అనుభవం ఉంది. కాబట్టి కోహ్లీ అదే స్థానంలో పంపిస్తాడా లేదా? మరో నిర్ణయం తీసుకుంటాడో వేచి చూద్దాం' అని రోహిత్ అన్నాడు.