
హైదరాబాద్: ఐదు వన్డేల సిరిస్లో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య నేపియర్ వేదికగా బుధవారం తొలి వన్డే జరిగింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఆతిథ్య జట్టుపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ భారత బౌలర్ల దెబ్బకు 157 పరుగులకే చాపచుట్టేసింది. అయితే, కివీస్ ఆటగాడు ట్రెంట్ బౌల్ట్ బ్యాటింగ్ చేస్తుండగా వికెట్ కీపర్ పక్కనే ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మ ఒకానొక దశలో నవ్వుని ఆపుకోలేకపోయాడు.
ఇన్నింగ్స్ 37వ ఓవర్ను స్పిన్నర్ చాహల్ బౌలింగ్ చేశాడు. క్రీజులో ఉన్న ట్రెంట్ బౌల్ట్ చాహల్ బౌలింగ్కు అనుగుణంగా బౌల్ట్ కూడా సన్నద్ధమై కిందికి వంగాడు. అయితే చివరి నిమిషంలో చాహల్ వేసిన బంతికి బౌల్ట్ గందరగోళానికి గురయ్యాడు. దీనిని చూసిన రోహిత్ శర్మ నవ్వుని ఆపుకోలేకపోయాడు.
అయితే, రోహిత్ శర్మ నవ్వడాన్ని చూసిన బౌల్ట్ కోపగించుకోకుండా రోహిత్ వైపు చూసి నవ్వుకుని ఆ తర్వాత బ్యాటింగ్ని కొనసాగించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, ఇరు జట్ల మధ్య రెండో వన్డే జనవరి 26న జరగనుంది.