
అయ్యర్కు అవకాశం
విరాట్ కోహ్లీతో పాటు రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీకి భారత సెలెక్టర్లు విశ్రాంతినిచ్చారు. టెస్టు ఫార్మాట్లో ఇరగదీస్తున్న హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ను పరిమిత ఓవర్ల కోసం బీసీసీఐ ఎంపిక చేసింది. మెగా టోర్నీలో కేవలం బ్యాటర్గానే సేవలందించిన ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా స్థానంలో సెలెక్టర్లు ఐపీఎల్ స్టార్ వెంకటేశ్ అయ్యర్కు అవకాశం కల్పించారు.
మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిని పక్కనపెట్టిన సెలెక్టర్లు.. లెగ్స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్కు అవకాశం ఇచ్చారు. ప్రపంచకప్లో రిజర్వ్ ఆటగాళ్లుగా కొనసాగిన శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, దీపక్ చహర్కు భారత జట్టులో చోటు దక్కింది.

శ్రీలంకకు వెళ్లి ఆడు
అయితే న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం కేరళ వికెట్ కీపర్, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్కు భారత జట్టులో చోటు దక్కలేదు. టీ20 ప్రపంచకప్ 2021కు వికెట్ కీపింగ్ ఆప్షన్లుగా ఎంచుకున్న రిషబ్ పంత్, ఇషాన్ కిషన్కు మరోసారి భారత సెలెక్టర్లు అవకాశం ఇచ్చారు. దీంతో శాంసన్కు చోటు దక్కకుండా పోయింది. దాంతో భారత అభిమానులు బీసీసీఐ సెలక్టర్లపై మండిపడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
'డియర్ సంజూ శాంసన్.. దయచేసి శ్రీలంకకు వెళ్లి ఆ జట్టు కోసం ఆడండి. మీ రాకను వారు స్వాగతిస్తారు. మిమ్మల్ని మేము ఉత్సాహపరుస్తాము. లంక మాజీ కెప్టెన్ కుమార సంగకర వంటి దిగ్గజాలకు మాత్రమే నీ విలువ తెలుసు' అని ఓ అభిమాని కామెంట్ చేశాడు. ' శాంసన్ ప్రతిభను సంగకర గుర్తించాడు.. బీసీసీఐ ఎప్పుడు గుర్తిస్తుందో' అని ఇంకో అభిమాని ట్వీట్ చేశాడు.

పంత్కు అండగా నిలిచిన బీసీసీఐ.. శాంసన్కు మాత్రం
'ఇషాన్ కిషన్ కంటే మంచ్చి ఓపెనర్ సంజూ శాంసన్', 'భారత్ ఓ డైమండ్ సేవలు కోల్పోయింది', 'మూడో స్థానంలో సంజూ శాంసన్ బెటర్ ఆప్షన్', 'రోహిత్ ముంబై ఆటగాళ్లనే ఎంచుకుంటాడు' అంటూ భారత ఫాన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. రిషబ్ పంత్కు అండగా నిలిచిన బీసీసీఐ.. సంజూ శాంసన్కు ఎందుకు నిలవట్లేదో అని ఇంకొందరు ఫాన్స్ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి భారత అభిమానులు JusticeForSanjuSamson అనే హ్యాష్ ట్యాగ్ నెట్టింట ట్రెండ్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో శాంసన్ పేరు మార్మోగిపోతోంది. నిజానికి బీసీసీఐ శాంసన్కు ఎక్కువ అవకాశాలు ఇవ్వలేదనే చెప్పాలి.
2015లో అరంగేట్రం
2015లో జింబాబ్వేతో జరిగిన పరిమిత ఓవర్ల సిరీస్ ద్వారా భారత జట్టు తరఫున సంజూ శాంసన్ అరంగేట్రం చేశాడు. మొత్తంగా 10 టీ20లు ఆడిన శాంసన్ 110.37 సగటుతో 117 పరుగులు సాధించాడు. అత్యధిక స్కోర్ 27. ఇక ఈ ఏడాది శ్రీలంక పర్యటనలో ఒక వన్డే ఆడి 46 బంతుల్లో 46 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్కు శాంసన్ సారథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. శాంసన్ ఒక వన్డే ఆడి 46 పరుగులు చేయగా.. టెస్టులో ఇంకా ఆరంగేట్రం చేయలేదు.


Click it and Unblock the Notifications
