హెన్రీ షాక్:
కివీస్ నిర్దేశించిన 240 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు కివీస్ బౌలర్ మ్యాట్ హెన్రీ షాక్ ఇచ్చాడు. నాలుగు బంతులు ఆడిన ఓపెనర్ రోహిత్ శర్మ (1; 4 బంతుల్లో) ఒక్క పరుగు మాత్రమే చేసి కీపర్ లాథమ్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మరో పేసర్ ట్రెంట్ బౌల్ట్ వేసిన 2.4వ బంతిని ఆడే క్రమంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ (1; 6 వికెట్లు) వికెట్ల ముందు దొరికిపోయాడు. విరాట్ సమీక్ష కోరినా.. ఫలితం లేకుండా పోయింది.
5 పరుగులకే కీలక మూడు వికెట్లు:
దీని నుంచి తేరుకోకముందే మాట్ హెన్రీ మరో షాక్ ఇచ్చాడు. కేఎల్ రాహుల్ (1; 7 బంతుల్లో)ను హెన్రీ (3.1వ బంతికి) పెవిలియన్ చేర్చాడు. దీంతో టీమిండియా 5 పరుగులకే కీలక మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో భాద్యతగా ఆడాల్సిన దినేష్ కార్తీక్ (6; 25బంతుల్లో) ఔట్ అయ్యాడు. మ్యాట్ హెన్రీ బౌలింగ్లో జేమ్స్ నీషమ్ సూపర్ క్యాచ్ పట్టడంతో కార్తీక్ పెవిలియన్ చేరాడు. అనంతరం రిషభ్ పంత్ (32; 56 బంతుల్లో 4×4) శాంట్నర్ వేసిన 22.5వ బంతిని షాట్ ఆడి గ్రాండ్హోమ్కి చిక్కాడు.
అర్ధ శతకాలు:
శాంట్నర్ వేసిన 30.3వ బంతికి హార్దిక్ పాండ్యా (32; 62 బంతుల్లో 2×4) భారీ షాట్ ఆడగా.. కెప్టెన్ విలియమ్సన్ అద్భుత క్యాచ్ అందుకున్నాడు. దీంతో భారత్ 94 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా (77 59 బంతుల్లో 4ఫోర్లు, 4సిక్సర్లు), ఎంఎస్ ధోనీ (50 72 బంతుల్లో ఫోర్, సిక్స్) అర్ధ శతకాలతో రాణించడంతో భారత్ గెలుస్తుందని భావించారు.
జడేజా క్యాచ్ ఔట్.. ధోనీ రనౌట్:
జడేజా, ధోనీ ఇద్దరూ 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఐతే ఆఖర్లో జడేజా క్యాచ్ ఔట్.. ధోనీ రనౌట్ కావడంతో భారత్ ఓటమి ఖాయమైంది. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ మూడు.. బౌల్ట్, శాంట్నర్ రెండేసి వికెట్లు తీశారు. అంతకుముందు 211/5తో ఇన్నింగ్స్ కొనసాగించిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 239 పరుగులు చేసింది. విలియమ్సన్ (67), రాస్ టేలర్ (74) పరుగులు చేశారు.