
35 పరుగుల తేడాతో విజయం
వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్తో ఆదివారం జరిగిన ఆఖరి వన్డేలో సమష్టిగా రాణించిన భారత్ జట్టు 35 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఐదో వన్డే అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ "టాస్ వేసే ముందే పిచ్ పరిశీలించాను. పిచ్పై కాస్త తేమ ఉన్నట్లు అనిపించింది. ప్రపంచకప్ ముందున్న నేపథ్యంలో ఇలాంటి పిచ్పై ఆరంభంలో బ్యాటింగ్ చేస్తే ఆ సవాల్ను ఎలా ఎదుర్కొగలం అనే ఉద్దేశంతోనే టాస్ గెలిచినా బ్యాటింగ్ ఎంచుకున్నా" అని వెల్లడించాడు.

రాయుడు, విజయ్ శంకర్ అద్భుత ప్రదర్శన
"నాలుగో వన్డేలో చెత్త ప్రదర్శన తర్వాత ఈసారి కలిసికట్టుగా రాణిద్దామని సహచరులకు చెప్పా. అయితే ఆరంభంలోనే 4 వికెట్లు పడ్డాక ఎవరో ఒకరు నిలవాల్సిన అవసరం ఏర్పడింది. ఆ బాధ్యతలను రాయుడు, విజయ్ శంకర్ అద్భుతంగా నిర్వర్తించారు. తొలి 30 ఓవర్లలో రన్రేట్ గొప్పగా ఏమీ లేదు.. కానీ చివరికి 250పైన స్కోరు చేయగలిగాం" అని రోహిత్ శర్మ అన్నాడు.

ఈ సిరీస్ విజయం మరుపురానిది
"చివర్లో జాదవ్, హార్దిక్ ఆడిన తీరు మమ్మల్ని మ్యాచ్లో నిలబెట్టింది. మా బౌలర్లు కూడా ప్రతిభ కనబరిచారు. ఛేదన సులువే అనిపించినా న్యూజిలాండ్ను నిలువరించారు. ఈ సిరీస్ విజయం మరుపురానిది" అని రోహిత్ శర్మ వెల్లడించాడు. 253 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు 44.1 ఓవర్లలోనే 217 పరుగులకి కుప్పకూలింది.

రాయుడికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు
ఐదో వన్డేలో 90 పరుగులు చేసిన రాయుడికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. టీమిండియా పేసర్ మహమ్మద్ షమీకి ప్లేయర్ ఆఫ్ ద సిరిస్ అవార్డు లభించింది. అంతకముందు అంబటి రాయుడు (90: 113 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సులు), హార్దిక్ పాండ్యా (45: 22 బంతుల్లో 2 ఫోర్లు, 5సిక్సులు) మెరుపులు మెరిపించడంతో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 49.5 ఓవర్లలో 252 పరుగులు చేసి ఆలౌటైంది. న్యూజిలాండ్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 3 వికెట్లు, నీషమ్ ఒక వికెట్ తీసుకున్నారు.


Click it and Unblock the Notifications












