
వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రోహిత్
2013లో బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాపై 209, 2014లో శ్రీలంకపై 264 పరుగులు సాధించాడు. వన్డేల్లో ఇప్పటికీ ఇదే అత్యధిక స్కోరు. 2014లో శ్రీలంకతో కోల్కతా ఈడెన్ గార్డెన్స్లో జరిగిన వన్డేలో రోహిత్ 264 పరుగులు చేశాడు. ఇక, మూడో డబుల్ సెంచరీని 2017లో మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 208 పరుగులు చేసి సాధించాడు.

ప్రపంచ రికార్డు నమోదు
2013లో బెంగళూరులో ఆస్ట్రేలియాపై రోహిత్ తన కెరీర్లో తొలి డబుల్ సెంచరీ సాధించాడు. వన్డేల్లో తొలి డబుల్ సెంచరీని సాధించే క్రమంలో ఆస్ట్రేలియాపై రోహిత్ శర్మ 16 సిక్సులు బాదాడు. అప్పట్లో ఇది ప్రపంచ రికార్డు కావడం విశేషం. దీంతో ఏబీడివిలియర్స్, క్రిస్గేల్ వంటి దిగ్గజాల రికార్డులను సమం చేశాడు. అంతేకాకుండా ఆస్ట్రేలియాపై రోహిత్ ఇప్పటి వరకు 66 సిక్స్లు కొట్టాడు.

విజయవంతమైన ఓపెనర్గా
2013కు ముందు డోలాయమానంలో పడ్డ రోహిత్ కెరీర్ను ధోనీ గాడిలో పెట్టాడు. రోహిత్ మీద నమ్మకం పెట్టి అతడిని ఓపెనర్గా బరిలోకి దింపాడు. ఓపెనర్గా టీమిండియాకు అనేక అద్భుతమైన భాగస్వామ్యాలను నమోదు చేశాడు. ఓపెనర్గా బరిలోకి దిగి రోహిత్ శర్మ 50 ఓవర్ల పాటు మ్యాచ్ ఆడిన సందర్భాలు కూడా అనేకం. ఇప్పుడు విజయవంతమైన ఓపెనర్గా కొనసాగుతున్నాడు.

200వ వన్డేలో పేలవ ప్రదర్శన కనబర్చిన రోహిత్
ఈ క్రమంలో ‘హిట్మ్యాన్'గానూ పేరు తెచ్చుకున్నాడు. తన 200వ వన్డేలో రోహిత్ శర్మ(7) పేలవ ప్రదర్శనతో అభిమానులను నిరాశపరిచాడు. అంతేకాదు ఈ వన్డే రోహిత్ శర్మకు హామిల్టన్ చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత జట్టు కివీస్ బౌలర్ల దెబ్బకు 30.5 ఓవర్లలో కేవలం 92 పరుగులకే కుప్పకూలిపోయింది.

తొమ్మిదేళ్ల తర్వాత భారత్ అతిపెద్ద ఓటమి
అనంతరం భారత్ నిర్దేశించిన 93 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ కేవలం 14.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో భారత జట్టుపై న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో టీమిండియా ఓ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకుంది. దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత అతిపెద్ద ఓటమిని రుచి చూసింది.


Click it and Unblock the Notifications
