వెల్లింగ్టన్: భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ తొలి రోజుకి వరుణుడు అడ్డుపడ్డ విషయం తెలిసిందే. టీ బ్రేక్ తర్వాత వర్షం కురుస్తుండడంతో మ్యాచ్కి అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం భారత్ ఐదు వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్కు శుభారంభం దక్కలేదు. పృథ్వీ షా (16), చటేశ్వర్ పుజారా (11), కెప్టెన్ విరాట్ కోహ్లీ (2), హనుమ విహారి (7) వరుసగా పెవిలియన్ చేరారు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (34) మాత్రం కాస్త ఫర్వాలేదనిపించాడు.
కోహ్లీ వికెట్ తీశానా.. ఇప్పటికీ నమ్మలేకపోతున్నా: జెమీసన్
ప్రస్తుతం క్రీజులో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ (10), అజింక్య రహానే (38)లు ఉన్నారు. ఈ మ్యాచ్లో భారత టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమయిన నేపథ్యంలో.. ప్రస్తుతం క్రీజులో ఉన్న పంత్, రహానేలు తమ బ్యాట్లకి పని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ జోడి రాణిస్తేనే భారత్ కోలుకుంటుంది. మంచి భాగస్వామ్యం నెలకొల్పితే కష్టాల్లో ఉన్న జట్టు గట్టెక్కుతుంది. ఆపై ఆర్ అశ్విన్, ఇషాంత్ శర్మ, మొహమ్మద్ షమీలు తమ వంతుగా తలో చేయి వేస్తారు.
ప్రస్తుత పరిస్థితులను రిషబ్ పంత్ సద్వినియోగం చేసుకుంటే మరిన్ని మ్యాచులు ఆడే అవకాశం ఉంది. అంతేకాకుండా అతనికి కాస్త ఊరట లభిస్తుంది. రహానేతో కలిసి మంచి భాగస్వామ్యం నమోదు చేసి జట్టు గౌరవప్రదమైన స్కోర్ సాధిచేందుకు తోడ్పడితే.. అతన్ని జట్టులో కొనసాగించే అవకాశాలు కూడా ఉన్నాయి, లేదా.. మళ్లీ అతను బెంచ్కు పరిమితం కావాల్సి వస్తుందని నిపుణుల అంచనా. ఇది పంత్కు దక్కిన తుది అవకాశంగా అందరూ అంటున్నారు. మరి మనోడు ఎం చేస్తాడో చూడాలి.
మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ స్థానంలో జట్టులోకి వచ్చాడంటూ.. అంతా పంత్ గురించి ఆరంభంలో గొప్పగా మాట్లాడుకున్నారు. కానీ.. పంత్ ఆడిన ఏ మ్యాచ్లోనూ అంచనాలను అందుకోలేకపోయాడు. తొందరపాటు బ్యాటింగ్తో స్వల్ప స్కోర్లకే పరిమితమయ్యాడు. ఆ తర్వాత గాయం కావడంతో.. ఏకంగా తుది జట్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో జట్టులోకి వచ్చిన కేఎల్ రాహుల్ దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. దీంతో పంత్కు మళ్లీ జట్టులో చోటు దక్కే అవకాశాలు తగ్గాయి. ఇప్పటికైనా పంత్ మేల్కొంటే అదే పదివేలు.