పాండ్యా మాట్లాడుతూ
మ్యాచ్ అనంతరం కృనాల్ పాండ్యా మాట్లాడుతూ "అవును, 220 పరుగుల విజయ లక్ష్యం అంత సులభం కాదు. ముందు మేం పవర్ప్లే, ఆ తర్వాత మిడిల్ ఓవర్లలో భారీగా పరుగులిచ్చాం. అలాంటప్పుడు పిచ్తో సంబంధం ఉండదు. పరుగుల ఒత్తిడి కచ్చితంగా ఉంటుంది. కివీస్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది" అని అన్నాడు.
చాలాసార్లు చెత్త బంతులు వేశాం
"ఈ మ్యాచ్లో మేం చాలాసార్లు చెత్త బంతులు వేశాం. క్యాచ్లు అందుకొనేటప్పుడు గాలి ప్రభావం అంతగా ఏమీ లేదు. ఒక్కోసారి అద్భుతంగా క్యాచ్లు పడతాం. మరోసారి కుదరకపోవచ్చు. మ్యాచ్ ఓటమికి క్యాచ్ లు కూడా ఓ భాగమే. ప్రతి మ్యాచ్ నుంచి మనం నేర్చుకోవాలి. టిమ్ సౌథీ బౌలింగ్ను ఇండియా-ఏకు ఆడినప్పుడు ఎదుర్కొన్నా" అని పాండ్యా వెల్లడించాడు.
అతనో గొప్ప బౌలర్
"అతనెందుకు గొప్ప బౌలరో ఈ రోజు నిరూపించుకున్నాడు. మా జట్టులో కావాల్సిన అన్ని వనరులు ఉన్నాయి. ఈ రోజు మాకు కలిసి రాలేదంతే. ఇలాంటి తప్పులు మరోసారి చేయకుండా ఉండాలి" అని కృనాల్ పాండ్యా చెప్పుకొచ్చాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది.
ధోని ఒక్కడే టాప్ స్కోరర్
అనంతరం 220 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 19.2 ఓవర్లలో 139 పరుగులకే కుప్పకూలింది. భారత్ తరుపున ధోని(39) ఒక్కడే టాప్ స్కోరర్గా నిలిచాడు. ఈ క్రమంలో టీ20ల్లో ధోని అత్యధిక పరుగులు సాధించిన ప్రతి మ్యాచ్లోనూ టీమిండియా ఓటమిపాలైంది.